‘చావు’ బిజినెస్‌.. త‌ప్ప‌న‌లేం.. కాద‌న‌లేం..!

దేశాన్ని క‌రోనా కాలం ప‌ట్టిపీడిస్తోంది. ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని బతుకున్న ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో క‌రోనా బారిన ప‌డి.. ఎవ‌రైనా మృతి చెందినా.. వారికి స‌రైన రీతిలో ద‌హ‌న సంస్కారాలు చేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆత్మీయులు పోయార‌న్న ఆవేద‌న‌.. వెంటాడుతున్నా.. క‌రోనా భీతి .. మ‌నషుల‌ను నిలువునా కాల్చేస్తోంది. దీంతో అయిన వారికి అంతిమ సంస్కారం చేసేందుకు సైతం వెనుకాడుతున్న వారు క‌నిపిస్తున్నారు. చనిపోయిన వారినుంచి కరోనా తమకు ఎక్కడ అంటుకుంటుందోనని భయంతో వెనకడుగు వేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందే కరోనా శవాలకు ఇష్టానుసారంగా.. అంత్యక్రియలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.

ఎంత వ‌సూలంటే..
స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే ‘చావు’ బిజినెస్ ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చింది. కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలు కూడా ఓ బిజినెస్‌గా మార్చుకున్నారు కొంద‌రు. కోవిడ్‌ బాధిత మృతుల దహన సంస్కారాల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని కార్పొరేట్‌ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో వీరిని త‌ప్పుప‌ట్ట‌లేం.. అలాగ‌ని, వీరి బిజినెస్ దాహాన్ని త‌ప్పుప‌ట్ట‌కుండా ఉండ‌లేం. ఏకంగా.. ఒక్కో బాధిత కుటుంబం నుంచి 30వేల నుంచి 35 వేల రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నారు. నిజానికి ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఇంత తీసుకోవ‌డం అవ‌స‌ర‌మా? అనేది ప్ర‌శ్న‌. కానీ, అలాగ‌ని వారు చేస్తున్న సేవ‌ల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌శ్నించ‌లేం. ఇదో ‘విప‌త్క‌ర’ ప‌రిస్థితి!

ఏం చేస్తారంటే..
కోవిడ్‌ సోకి ఎవరైనా చనిపోతే వారిని వ్యాన్‌లో తీసుకురావడం, దహన సంస్కారాలు.. చేయడం.. ఇలా అన్ని పనులు వీరే చూసుకుంటారు. వీటన్నింటికి కలిసి ఓ స్పెషల్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. వీటికి 30 వేల రూపాయల నుంచి 35 వేల వరకు వసూలు చేయనున్నారు. దేశం‌లోని దాదాపు ఏడు ప్రధాన నగరాల్లో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి. మ‌న హైద‌రాబాద్‌లోనూ రెండు సంస్థ‌లు ఈ సేవ చేస్తున్నాయి.

ఆంథెస్టీ.. 32 వేలు..
ఆంథెస్టి ఫ్యూనరల్ సర్వీసెస్‌ ఈ ఏజెన్సీ చెన్నై, బెంగళూరు, జైపూర్‌,హైదరాబాద్‌ వంటి నగరాల్లో బ్రాంచ్‌లున్నాయి. అదే హైదరాబాద్‌లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించేదుకు 32,000 వేల రూపాయలు వసూలు చేస్తుంది. వీరు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు. హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడం. దహనం చేయడం. చితాభస్మాన్ని కుటుంబీకులకు అందజేయడం ఇలాంటివన్నీ నిర్వహిస్తారు.

హైద‌రాబాద్‌లో రెండు ప్యాకేజీలు..
క‌రోనా మృత దేహాల‌కు అంతిమ సంస్కారం నిర్వ‌హించేందుకు హైదరాబాద్‌లోని ఫ్యునరల్‌ సేవ సర్వీసెస్‌ కూడా పనిచేస్తోంది. ఇది గోల్డ్‌, సిల్వర్‌ అంటు రెండు రకాల ప్యాకెజీలను అందిస్తోంది. ఇందుకు 30,000 వేల రూపాయలు తీసుకుంటున్నారు. రోజుకి 6 నుంచి 10 కాల్స్‌ వస్తున్నాయని అంటున్నారు. ఏదేమైనా ఆత్మీయులు ‘దూరం’ అవుతున్న వేళ అంత్యక్రియలు నిర్వహించే ఆయా ఏజెన్సీలు బిజినెస్ చేసుకుంటున్నాయ‌ని అనేవారు ఉన్నా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇదే మ‌హాసేవ‌గా భావిస్తున్న వారు కూడా క‌నిపిస్తున్నారు.