టాలీవుడ్లో మళ్లీ సంక్షోభం తప్పదా?


కరోనా భయం తొలగిపోయినట్లే.. కష్టాలకు ఇక సెలవన్నట్లే.. సంక్షోభాన్ని విజయవంతంగా దాటేసినట్లే.. నెలన్నర ముందు వరకు వరకు అందరిలోనూ ఇదే ధీమా కనిపించింది. ముఖ్యంగా కరోనా ధాటికి తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ పూర్వ స్థితికి చేరుకునే దిశగా అడుగులు పడుతుండటంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. వేరే సినీ పరిశ్రమలు ఇంకా తడబడుతున్నప్పటికీ.. టాలీవుడ్లో మాత్రం ఒకప్పటి సందడి కనిపించింది. షూటింగ్స్‌ జోరుగా సాగాయి. థియేటర్లలో సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. 100 శాతం ఆక్యుపెన్సీ కూడా వచ్చేయడంతో ఇక తిరుగులేదని అనుకున్నాయి.

వేసవిలో సినీ వినోదం పతాక స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే అంతా మారిపోయింది. కరోనా మళ్లీ పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టడం మొదలైంది. పేరున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. వరుసగా సినిమా షూటింగ్స్ ఆగిపోతున్నాయి.

ఇంకొన్ని రోజుల్లోనే థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని అమలు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మళ్లీ జనాల్లో కరోనా భయం కనిపిస్తుండటం, రాబోయే వారాల్లో క్రేజీ సినిమాలేవీ రిలీజయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆక్యుపెన్సీ ఎంత అన్నది సంబంధం లేదు. థియేటర్లు వెలవెలబోవడం ఖాయం. పెద్ద సినిమాలైతే కరోనా గురించి పట్టించుకోకుండా జనాలు వస్తారు. కానీ చిన్న సినిమాల కోసం రిస్క్ చేసి వస్తారా అన్నది డౌటే. థియేటర్లు నామమాత్రంగా నడవడబోతున్నాయన్నది స్పష్టం. కాబట్టి వీటిని నమ్ముకున్న వారికి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.

మరోవైపు కరోనా ప్రభావంతో వరుసగా సినిమాల షూటింగ్స్ క్యాన్సిలవుతున్నాయి. రోజు రోజుకూ ముప్పు పెరుగుతుండటంతో మొత్తం అన్ని షూటింగ్స్ రద్దు చేసేలా పరిశ్రమలో నిర్ణయం తీసుకోక తప్పేలా లేదు. అదే జరిగితే ఇండస్ట్రీ మళ్లీ ఒకప్పటిలా సంక్షోభంలో పడటం ఖాయం. సినీ కార్మికులకు కష్టాలు తప్పవు. కానీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇది అనివార్యం అయ్యేలా ఉంది.