ప్రభాస్ కోసం మైత్రీ వారి మెగా ప్లాన్


ప్రస్తుతం ఇండియన్ సూపర్ స్టార్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నంత ఊపులో ఇంకెవరూ లేరనడంలో మరో మాట లేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోగా.. అతడితో ప్లాన్ చేసే ప్రతి సినిమాకూ వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ప్రతిదీ పాన్ ఇండియా లెవెల్లో ఉంటోంది. ఇంత భారీ ప్లానింగ్ అన్నాక ఒక సినిమా పూర్తి చేసి ఇంకోదానికి వెళ్లడమే ఉత్తమం అనుకుంటారు ఎవరైనా. కానీ ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా వరుసబెట్టి భారీ ప్రాజెక్టులు కమిటవుతున్నాడు.

‘సాహో’ చేస్తున్నంత వరకు కొంచెం ఆచితూచి వ్యవహరించిన ప్రభాస్.. ఆ తర్వాత మాత్రం ఆగట్లేదు. ‘రాధేశ్యామ్’ సెట్స్ మీద ఉండగానే.. నాగ్ అశ్విన్ చిత్రం, ఆదిపురుష్, సలార్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’ ఇప్పటికే చిత్రీకరణ కూడా మొదలుపెట్టుకున్నాయి. వీటితో పాటు ‘రాధేశ్యామ్’ బ్యాలెన్స్ షూటింగ్ కూడా చేయాల్సి ఉంది ప్రభాస్. ఈ మూడూ అయ్యాక నాగ్ అశ్విన్ సినిమా చేయాల్సి ఉంది.

చేతిలో ఇన్ని ప్రాజెక్టులుండగా.. ఇంకో సినిమా జోలికి వెళ్లడనే అంతా అనుకున్నారు. కానీ అతను వేరే దర్శక నిర్మాతలతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ ఓ క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు సమాచారం. ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్లు కొన్ని నెలల కిందటే సంకేతాలు ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్.. అనుకున్నట్లే ఓ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది.

బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ‘వార్’ చిత్రంతో బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు సిద్దార్థ్. ప్రస్తుతం అతను షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ తీస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్, హృతిక్ రోషన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. దాని సంగతి ఏమైందో కానీ.. ఇప్పుడు మైత్రీ నుంచి అతను అడ్వాన్స్ తీసుకున్నాడని.. ప్రభాస్‌తో సినిమాకు ఓకే అన్నాడని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో తెలియదు కానీ.. త్వరలోనే ప్రకటన మాత్రం వస్తుందట.