నాయ‌కుల‌కు రెస్ట్ లేదు.. తెలంగాణ‌లో మళ్లీ ఎన్నిక‌ల పోరు!

తెలంగాణలో వ‌రుస ఎన్నిక‌లు రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత ఇంక రిలాక్స్ అవుదామ‌ని అనుకున్న రాజ‌కీయ నేత‌ల‌కు ఇప్పుడు మ‌ళ్లీ స్థానిక ఎన్నిక ‌ల ప‌ర్వం ప్రారంభం అవుతుండ‌డంతో జెండా భుజానేసుకుని.. మైకు చేత‌ప‌ట్టుకుని ప్ర‌చారంలోకి దిగిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, జడ్చర్ల, అచ్ఛంపెట్, నకిరేకల్ మున్సి పల్ ఎన్నికల నగారా ఏ క్షణమైనా మోగనుంది.

సీడీఎంఎ అధికారుల సమక్షంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల మహిళ రిజర్వేషన్ల లాటరీ వేయను న్నారు. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే ఎన్నికల అధికారులు గురువారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా ఇప్పటికే వార్డుల విభజన ప్రక్రియ పూర్తి అయింది. ఇక‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, సిద్ధిపేటల‌లో కేసీఆర్ హ‌వా ఎప్ప‌టిలాగే క‌నిపించ‌నుంది. ఇక‌, నకిరేక‌ల్‌, అచ్చంపేట్‌ల‌లో మాత్రం కాంగ్రెస్ హ‌వా క‌నిపించే అవ‌కాశం ఉంది. అయితే.. ఏదైనా కూడా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌భావం ఈ ఎన్నిక‌పై ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, ఎంఐఎం, బీజేపీ, క‌మ్యూనిస్టుల‌తోపాటు ఈ సారి జ‌రుగుతున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో వైఎస్ ష‌ర్మిల ఏర్పాటు చేయ‌నున్న కొత్త పార్టీ కూడా పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. అయితే.. పార్టీ ప్ర‌క‌ట‌న‌కు ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం(జూలై 2) ఉంది క‌నుక‌.. ఆమె పార్టీ పోటీ చేసే అవ‌కాశం లేద‌నే అంచనాలు వ‌స్తున్నాయి. దీంతో మ‌ళ్లీ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ స్థాయిలో ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, సిద్ధిపేట‌, జ‌డ్చ‌ర్లలో పోరు సాగుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

సాగ‌ర్‌లో క‌నుక టీఆర్ఎస్ గెలిస్తే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో దూకుడు పెరిగే అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా ఇక్క‌డ జానారెడ్డి విజ‌యం ద‌క్కించుకుంటే.. మాత్రం ఖ‌చ్చితంగా కాంగ్రెస్ గ‌ట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఏదేమైనా.. ఒక‌టి రెండు రోజుల్లోనే తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు అధికారులు. దీంతో సాగ‌ర్ ఇలా ముగియ‌డంతో నేత‌లు.. అలా మ‌ళ్లీ ఎన్నిక‌ల రంగంలోకి దిగాల్సి ఉంటుంద‌న్న మాట‌.