పవన్ను నమ్ముకుని మునిగినట్లేనా ?

మామూలుగా అయితే తిరుపతి లోక్ సభ పరిధిలో బీజేపీకి ఉన్నదేమీ లేదు. అందుకనే ఓట్లకోసం మిత్రపక్షం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ణు నమ్ముకున్నది. పవన్ను చూసుకుని గ్రౌండ్ లేవల్లో ఏమీలేకపోయినా ఆకాశమంత ఎత్తున రెచ్చిపోయింది. సీన్ కట్ చేస్తే విషయం ఏమిటో చాలా క్లియర్ గా అర్ధమైపోయింది. ఎందుకంటే ఎంతో నమ్మకం పెట్టుకున్న పవన్ పెద్దగా సహకారం అందించింది లేదు.

చూస్తుండగానే ఎన్నికల ప్రచారం ముగిసే తేదీ మాత్రం వచ్చేసింది. 15వ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగిసిపోతుంది. మరిప్పటికే పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్లను పెట్టుకోవటం, తెరవెనుక మంత్రాంగం నడిపించటం లాంటివన్నీ అయిపోయుండాలి. కానీ అలాంటిదేమీ జరగలేదని సమాచారం. కారణం ఏమిటంటే పవన్ ఒక్కసారి మాత్రమే ప్రచారం చేశారు. గడచిన వారం రోజులుగా కరోనా వైరస్ పేరుతో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.

క్వారంటైన్ కారణంగా ప్రచారానికి రమ్మని పిలిచేందుకు లేదు. అలాగని కావాలనే ప్రచారాన్ని ఎగొట్టారని ఆరోపించేందుకూ లేదు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలో పవన్ ఉంటే జనాల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని కమలనాదులు అనుకున్నారు. అయితే క్వారంటైన్ కారణంగా నడ్డా కార్యక్రమం కూడా చాలా పేలవంగా సాగిందట. పవన్ విషయం తెలుసుకున్న తర్వాత ఢిల్లీ నుండి రావాల్సిన కొందరు ముఖ్యుల పర్యటనలు కూడా రద్దయ్యాయట.

ఏదేమైనా పవన్ పై ఎంతో నమ్మకం పెట్టుకుంటే చివరకు ముణిగిపోయామనే బీజేపీలో చర్చ మొదలైంది. నిజానికి ఇక్కడ పోటీచేసే అవకాశం జనసేనకు వదిలేసుంటే సరిపోయేది. బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో చేసిన ఓవర్ యాక్షన్ ఫలితమే ఇఫుడు బీజేపీకి ఇబ్బందులు. మొత్తాన్ని చూసిన తర్వాత బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు డిపాజిట్ దక్కటం కూడా అనుమానమే అంటున్నారు. మరీ పరిస్దితికి తమను తాము నిందించుకుంటారా లేకపోతే పవన్ పై నెపాన్ని తోసేస్తారా ? చూడాల్సిందే.