ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు జ్ఞానోదయం అవుతుందా?


ఇండియన్ ప్రిమియర్ లీగ్ వేలం జరిగినపుడల్లా ఫ్రాంఛైజీల కన్ను విదేశీ ఆటగాళ్ల మీదే ఉంటుంది. వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎన్ని కోట్లయినా పోస్తారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్ల మీద ఫ్రాంఛైజీలు చూపించే మోజు గురించి అందరికీ తెలిసిందే. అలాగే గత కొన్నేళ్లలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఆటగాళ్లకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. దేశీయ ప్రతిభావంతుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ, కొన్నిసార్లు భారత జట్టుకు ఆడిన ఆటగాళ్లకు కూడా లకారాలకు మించి పెట్టని ఫ్రాంఛైజీలు.. విదేశాల్లో దేశవాళీ క్రికెటర్లకు మాత్రం కోట్లు పోసేస్తుంటాయి.

ఐతే ప్రదర్శన విషయానికి వస్తే ప్రతిసారీ విదేశీయుల కంటే మన దేశవాళీ ఆటగాళ్లే ప్రతిసారీ హైలైట్ అవుతుంటారు. ఈ సీజన్ విషయానికి వస్తే ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఆ నాలుగింట్లోనూ విదేశీ స్టార్ల కంటే మన ఆటగాళ్లే అదరగొట్టారు.

సోమవారం జరిగిన మ్యాచ్ విషయానికే వస్తే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.14.5 కోట్లు పోసి కొన్న జే రిచర్డ్‌సన్, రూ.8 కోట్లు పెట్టి కొన్న మెరిడిత్ తుస్సుమనిపిస్తే.. మన దేశవాళీ కుర్రాడైన అర్ష్‌దీప్ సింగ్ చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో మూడు వికెట్లు తీసి పంజాబ్‌ను గెలిపించాడు. ఇదే మ్యాచ్‌లో ఐపీఎల్ హైయెస్ట్ పెయిడ్ ఆటగాళ్లలో ఒకడైన బెన్ స్టోక్స్ (రాజస్థాన్ రాయల్స్) తుస్సుమనిపిస్తే సంజు శాంసన్ అద్భుత శతకంతో జట్టును విజయానికి అత్యంత చేరువగా తీసుకెళ్లాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన మోరిస్ బంతితో, బ్యాటుతో ఫెయిలయ్యాడు. అతను 4 బంతులాడి 2 పరుగులే చేశాడు. మోరిస్ షాట్లు కొట్టి ఉంటే రాయల్స్‌కు ఓటమి తప్పేది. బౌలింగ్‌లో స్టోక్స్, మోరిస్, ముస్తాఫిజుర్ లాంటి విదేశీ స్టార్ల కంటే కూడా కొత్త కుర్రాడు చేతన్ సకారియా అదరగొట్టడం గమనార్హం. అంతకు ముందు మ్యాచుల్లో కూడా నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ప్రసిద్ధ్ కృష్ణ (కోల్‌కతా).. మనీష్ పాండే (సన్‌రైజర్స్).. ధావన్, పృథ్వీ షా, అవేశ్ ఖాన్ (ఢిల్లీ).. రైనా (చెన్నై).. హర్షల్ పటేల్ (బెంగళూరు) లాంటి భారత ఆటగాళ్లే అదరగొట్టారు. ఇప్పటిదాకా అయితే విదేశీయుల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఇక నుంచైనా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వేలంలో విదేశీయుల కోసం వేలంవెర్రిగా ఖర్చు చేయడం తగ్గించి.. మన ఆటగాళ్ల మీద ఫోకస్ పెడితే బెటర్.