త్రివిక్రమ్‌తో గొడవ లేదు.. రాజీనే

ఎన్టీఆర్ 30వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే అని నందమూరి అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు కొన్ని రోజుల కిందటి వరకు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన గత ఏఢాదే వచ్చింది. కొన్ని వారాల కిందట కూడా ఈ కాంబినేషన్ పక్కా అనే చెప్పాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కానీ గత కొన్ని రోజుల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. త్రివిక్రమ్‌తో తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ చేయట్లేదన్న సమాచారం బయటికి వచ్చింది. ముందు ఇది రూమర్ అనే అంతా అనుకున్నారు. కానీ అదే నిజమని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నాడు. సోమవారం సాయంత్రం ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించి ప్రకటన కూడా రాబోతోందని.. కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడని అంటున్నారు.

ఐతే ‘అరవింద సమేత’ టైంలో, ఆ తర్వాత ఎంతో సన్నిహితంగా కనిపించిన ఎన్టీఆర్, త్రివిక్రమ్.. తమ కాంబినేషన్లో రెండో సినిమాకు కమిటై ఏడాది పాటు సంప్రదింపులు జరుపుతూ సాగాక ఇప్పుడు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు వస్తే తప్ప ఇలా ఓ సినిమా రద్దవదు. గతంలో మహేష్ బాబు, సుకుమార్‌ల మధ్య కూడా ఇలాగే తేడా కొట్టి సినిమా క్యాన్సిల్ అయింది. సుహృద్భావ వాతావరణంలోనే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని, తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారని అన్నారు. కానీ ఎవరి దారులు వారివి అయ్యాయి.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ విషయంలోనూ ఇలాగే అయిందని అనుకుంటున్నారు. కానీ వీరి సన్నిహితులు చెబుతున్న ప్రకారం.. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక మంచి వాతావరణంలోనే ప్రస్తుతానికి తమ కలయికలో సినిమా వద్దనుకున్నారని.. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం ఖాయమని అంటున్నారు. ఇద్దరి మధ్య గొడవేం జరగలేదని.. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలు అయ్యాక ముందు అనుకున్నట్లే హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 32వ సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నాడని సమాచారం.