టికెట్ల గొడ‌వ‌.. జ‌గ‌న్ త‌ప్పు లేద‌న్న నాగ‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇప్పుడు వ‌కీల్ సాబ్ సినిమా ఒక ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం.. రిలీజ్ ముందు రోజు నుంచే థియేట‌ర్ల మీద రెవెన్యూ అధికారులు దాడులు చేయ‌డం.. అత్య‌వ‌స‌రంగా టికెట్ల ధ‌ర‌ల విష‌య‌మై జీవో ఇవ్వ‌డం.. కోర్టులో ముందు ఎదురు దెబ్బ త‌గిలిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ పిటిష‌న్ వేసి మ‌రీ త‌మ అభీష్టం నెర‌వేరేలా చేసుకోవ‌డం తెలిసిందే.

ఈ విష‌య‌మై మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాద‌వ్ లాంటి వాళ్లు స్పందించి వ‌కీల్ సాబ్ సినిమాకు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వేరే సినిమాల‌కు టికెట్ల రేట్లు పెంచుకునే అవ‌కాశం క‌ల్పించి, వ‌కీల్ సాబ్‌కు నిరాక‌రించ‌డంతో ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ సినిమాను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. దీనిపై ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతున్నారు.

ఐతే ప‌వ‌న్ అన్న‌య్య‌, జ‌న‌సేన స‌భ్యుడు అయిన నాగ‌బాబు మాత్రం ఈ విష‌య‌మై ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌కీల్ సాబ్ టికెట్ల రేట్ల విష‌యంలో నెల‌కొన్న వివాదానికి, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సంబంధం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ఇంత‌కంటే పెద్ద బ్యాటిల్స్ ఉన్నాయ‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టాల‌నుకుంటే వేరే ర‌కంగా చేస్తాడ‌ని, కానీ వకీల్ సాబ్ టికెట్ల వ్య‌వ‌హారం లాంటి చిన్న విష‌యాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌చ్చ‌ని నాగ‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇది వైసీపీలో కింది స్థాయి నాయ‌కులు చేస్తున్న ప‌ని అని నాగ‌బాబు అనుమానం వ్య‌క్తం చేశారు. ఐతే నాగ‌బాబు వ్యాఖ్య‌లు మెగా అభిమానులు, జ‌న‌సైనికులు అంత‌గా రుచించ‌ట్లేదు. జ‌గ‌న్‌కు తెలియ‌కుండా, ఆయ‌న మ‌ద్ద‌తు లేకుండా మంత్రులు ఈ విష‌యంలో జోక్యం చేసుకోర‌ని.. దీన్ని ఇంత పెద్ద వివాదం చేయ‌ర‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నాగ‌బాబు వ్యాఖ్య‌ల్ని త‌ప్పుబ‌డుతూ వాళ్లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతుండ‌టం గ‌మ‌నార్హం.