వ‌కీల్ సాబ్‌కో న్యాయం.. వైల్డ్ డాగ్‌కో న్యాయ‌మా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్‌కు వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు తీవ్ర వివాదాస్ప‌ద‌మే అవుతోంది. మొన్న‌టిదాకా కాస్త పేరున్న సినిమాల‌న్నింటికీ టికెట్ల రేట్లు పెంచుకునే అవ‌కాశం క‌ల్పించింది ఏపీ ప్ర‌భుత్వం. కరోనా కార‌ణంగా నిర్మాత‌లు దెబ్బ తిన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో సైతం ఈ మేర‌కు సౌల‌భ్యం క‌ల్పించారు. ఏపీలో కూడా కొత్త సినిమాల‌కు రేట్లు పెంచుకోవ‌డానికి గ‌త వారం వ‌ర‌కు ఇబ్బంది లేక‌పోయింది.

ఏప్రిల్ 2న విడుద‌లైన అక్కినేని నాగార్జున చిత్రం వైల్డ్ డాగ్‌తో పాటు కార్తి మూవీ సుల్తాన్‌కు సైతం ఏపీలో రేట్లు పెంచారు. కానీ ఈ వారంలో వ‌కీల్ సాబ్ విష‌యానికొచ్చేస‌రికి ప్ర‌భుత్వ వైఖ‌రి మారిపోయింది. క‌రోనా నేప‌థ్యంలో బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోలు ర‌ద్దు చేయ‌డం వ‌ర‌కు ఓకే కానీ.. టికెట్ల రేట్లు విష‌యంలో ష‌ర‌తులు విధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టికెట్ల రేట్ల మీద నియంత్ర‌ణ ఎప్పుడూ దృష్టిసారిస్తే వివాదానికి ఆస్కార‌మే ఉండేది కాదు. కానీ గ‌త వారం వ‌చ్చిన సినిమాకు రేట్లు పెంచుకునే అవ‌కాశం క‌ల్పించి.. వ‌కీల్ సాబ్‌కు మాత్రం అడ్డుక‌ట్ట వేయ‌డంతో ఈ విష‌యాన్ని రాజ‌కీయ క‌క్షగానే చూస్తున్నారు. ఏపీలోని కొన్ని థియేట‌ర్ల‌లో ఇంకా వ‌కీల్ సాబ్ ఆడుతుండ‌గా, ఆ చిత్రానికి పెంచిన రేట్ల‌తో టికెట్లు అమ్ముతున్న విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు గుర్తించారు. టికెట్ బుకింగ్ యాప్‌లో ఒకే థియేట‌ర్లో వ‌కీల్ సాబ్‌కు ఒక రేటు, వైల్డ్ డాగ్‌కు ఒక రేటు ఉన్న స్క్రీన్ షాట్ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి ఇదేం న్యాయం అని ప్ర‌శ్నిస్తున్నారు.

గుంటూరులోని నాజ్ థియేట‌ర్లో వైల్డ్ డాగ్ సినిమాకు గోల్డ్ క్లాస్ రేటు రూ.150 ఉండ‌గా.. అదే థియేట‌ర్లో వ‌కీల్ సాబ్ గోల్డ్ క్లాస్ టికెట్ రేటు రూ.110గా ఉండ‌టం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి వ‌కీల్ సాబ్ మీద జ‌గ‌న్ స‌ర్కారు క‌క్ష‌గ‌ట్టిన‌ట్లే అని ప‌వ‌న్ ఫ్యాన్స్ తీర్మానానికి వ‌చ్చేస్తున్నారు. రాబోయే సినిమాల విష‌యంలో ఎంత క‌చ్చితంగా ఉంటారో చూస్తామ‌ని అంటున్నారు.