హై కోర్టు ఎందుకు బ్రేకులు వేసింది ?

పరిషత్ ఎన్నికలకు హైకోర్టు ఎందుకు బ్రేకులు వేసిందో అధికారపార్టీ నేతలకు అర్ధం కావటంలేదు. ప్రతిపక్షాలేమో రెండు అంశాలపై కోర్టులో కేసులు వేశాయి. ఏడాది క్రితం నోటిఫికేషన్ను రద్దుచేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నది మొదటి అంశం. ఇక రెండోదేమో ఎన్నికల నోటిఫికేషన్ కు నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలన్న సుప్రింకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదన్నది.

అయితే ఈ రెండు అంశాలను పరిశీలించిన హైకోర్టు పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేసింది. ఇదే సమయంలో సుప్రింకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనంటు ఎన్నికల ప్రక్రియపై స్టే ఇచ్చింది. మొదటి అంశంలో అందరికీ క్లారిటి వచ్చేసింది. అయితే రెండో అంశంపై కోర్టు ఆదేశాలే అర్ధం కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాత నోటిఫికేషన్ తోనే ఎన్నికలు జరుగుతాయని హైకోర్టే స్పష్టంగా తేల్చేసినపుడు ఇక నాలుగు వారాల సమయం అన్న ప్రశ్నే తలెత్తదు కదా.

స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న సమయంలోనే నీలం సాహ్నీ ఓ మాటన్నారు. పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నీలం పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల ప్రక్రియను తాను కంటిన్యు చేస్తున్నట్లు మాత్రమే చెప్పారు. అంటే అప్పట్లో పరిషత్ ఎన్నికలు ఎక్కడయితే ఆగిపోయాయో అక్కడి నుండే తాను కంటిన్యు చేస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు.

సో, నోటిఫికేషన్ కొత్తది కానపుడు నాలుగు వారాల వ్యవధి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. పాత నోటిఫికేషన్ తోనే ఎన్నికలు పెట్టాలని హైకోర్టే ఒకవైపు స్పష్టం చేసి మరోవైపు నాలుగు వారాల వ్యవధి లేదని చెప్పి ఎన్నికలకు బ్రేకు వేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి డివిజన్ బెంచ్ ఏమి చెబుతుందో చూద్దాం.