ఈ స్టార్లకు ఏమైందబ్బా ?

ఒకవైపు రెండు విడతల పోలింగ్ జరిగిపోయినా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఇంతవరకు కాంగ్రెస్ అగ్రనేతలు అడ్రస్ ఎక్కడా కనబడలేదు. ఇదే సమయంలో తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఒకవైపు, నరేంద్రమోడి, అమిత్ షా, జేపీ నడ్డా అండ్ కో మరోవైపు బెంగాల్లో వేడి పుట్టించేస్తున్నారు. ఇప్పటికి మోడి నాలుగు బహిరంగసభల్లో ప్రసంగిస్తే అమిత్ షా అయితే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడల్లా బెంగాల్లో పర్యటిస్తున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే కాంగ్రెస్+వామపక్షాలు+ముస్లిం సెక్యులర్ ఫ్రంట్ కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోరాడుతున్నాయి. వామపక్షాల తరపున అగ్రనేతలు ఎటూ రాష్ట్రంలోనే ఉన్నారు. అలాగే ముస్లిం సెక్యులర్ ఫ్రంట్ అధ్యక్షుడు అబ్బాస్ కూడా బెంగాలీయుడే కాబట్టి ఆయన ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ తరపున ఎవరు ప్రచారం చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోతగ్గ నేతలు లేరు.

అందుకనే బెంగాల్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా సోనియాగాంధి, రాహూల్, ప్రియాంక, రాజస్ధాన్ సిఎం అశోక్ గెహ్లాట్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్ధాన్ డిప్యుటి సీఎం సచిన్ పైలెట్, క్రికెటర్, పంజాబ్ మాజీమంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ, ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ లాంటి వాళ్ళు పాల్గొంటారని ఎన్నికల కమీషన్ దగ్గర పేర్లిచ్చారు.

స్టార్ క్యాంపెయినర్లుగా అంతమంది ప్రముఖల పేర్లిచ్చిన కాంగ్రెస్ పార్టీ బహుశా ఆ విషయాన్ని మరచిపోయిందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున 92 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరి కోసం కూడా ఇప్పటివరకు స్టార్లలో ఒక్కరు కూడా ప్రచారం చేయలేదు. సోనియాకు అనారోగ్యం కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. మరి మిగిలిన వాళ్ళకు ఏమైంది ?

రాహూల్ తమిళనాడు, కేరళపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రియాంక దృష్టంతా ఎక్కువగా అస్సాం మీదే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి మిగిలిన ఇద్దరు ముఖ్యమంత్రులు, డిప్యుటి సీఎం, అజహరుద్దీన్, నివ్ జ్యోత్ సిద్ధూ లాంటి వాళ్ళకి ఏమైందో ఎవరికీ అర్ధం కావటంలేదు. తలా రెండు రోజులు ప్రచారంలో పాల్గొన్నా పార్టీకి ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందన్న ఆలోచన కూడా స్టార్లకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.