ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పవా ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పేట్లు లేదు. పోలింగ్ పై కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దెబ్బ పడేట్లు అనుమానంగా ఉంది. దీంతో పాటు మండే ఎండల ప్రభావం కూడా తప్పదనే అనిపిస్తోంది. మామూలుగానే తిరుపతిలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఈసారి ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో పోలింగుకు ఓటర్లు ఏ మేరకు వస్తారనేది కాస్త అనుమానంగా తయారైంది.

మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ శాతం 79 గా నమోదైంది. అదే పోలింగ్ శాతం ఇపుడు రిపీటవుతుందా ? అన్నదే సందేహం. దీనికంటే ప్రధానంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ జనాలను భయపెడుతోంది. ఎండలంటే ఏదోలా మ్యానేజ్ చేయవచ్చనుకునే జనాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు ఆందోళనపడుతున్నారు. కరోనా తీవ్రత కూడా రోజు అంతకంతకు పెరిగిపోతోంది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 1398 మంది కరోనా బారిన పడగా 6 మంది చనిపోయారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న జిల్లాల్లో చిత్తూరు కూడా ఒకటి. జిల్లాలో తిరుపతి మొదటిస్ధానంలో నిలుస్తోంది. దీనికి కారణం ఏమిటంటే అంతర్జాతీయస్ధాయిలో  తిరుపతి మహా పుణ్యక్షేత్రంగా పేరు గడించటమే. శ్రీవారి దర్శనం కోసం ప్రపంచంలోని నలుమూలల నుండి భక్తులు పెద్దఎత్తున ప్రతిరోజు తిరుమలకు వస్తుంటారు. వీరంతా తిరుపతి మీదుగానే తిరుమల చేరుకుంటారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు తిరుపతిలో ఫ్లోటింగ్ జనాభా 2 లక్షలుంటుంది. అందుకనే జిల్లాలో తిరుపతిలో కరోనా సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది.

తిరుపతి తర్వాత కరోనా సమస్య ఎక్కువగా ఉండేది శ్రీకాళహస్తిలోనే. శ్రీ కాళహస్తి కూడా ప్రముఖ పుణ్యక్షేత్రమే. తిరుపతికి వచ్చిన  భక్తుల్లో  మెజారిటి శ్రీకాళహస్తిలోని ముక్కంటిని దర్శించుకునే వెళతారు. కాబట్టే అక్కడ కూడా కరోనా వైరస్ సమస్య ఎక్కువగానే ఉంది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.