‘వకీల్ సాబ్’ పట్టాలెక్కడానికి ముందు..

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. తెలుగులో చాలామంది స్టార్లతో సినిమాలు తీశారు. భారీ చిత్రాలను అందించారు. కానీ ఆయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలన్నది రెండు దశాబ్దాల నుంచి ఉన్న కల. నిర్మాత కాకముందే ఈ దిశగా కలలు కన్నారు. కానీ ఎట్టకేలకు ‘వకీల్ సాబ్’తో ఆయన కల నెరవేరింది.

ఐతే ఇది సాధ్యపడటానికి ముందు చాలానే కథ నడిచినట్లు దిల్ రాజు ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ ఎమోషనల్ స్టోరీ ఏంటో దిల్ రాజు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

“1999లో తొలి ప్రేమ సినిమా నుంచి కళ్యాణ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఆ సినిమాను నైజాం ఏరియాలో నేనే డిస్ట్రిబ్యూట్ చేశా. ఆ సినిమా మేకింగ్ దశలో ఉన్నప్పటి నుంచి పవన్‌ను అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవాడిని. ఆ సినిమా వంద రోజులు ఆడితే.. వందో రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎంలో స్పెషల్ షో వేశాం. జనాలు మరీ ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న సంధ్య 35 ఎంఎంలోనూ షో వేయాల్సి వచ్చింది. ఆ షో నడుస్తున్నపుడే ఎప్పటికైనా నిర్మాత అయితే పవన్‌తో సినిమా తీయాలని అనుకున్నా. ‘తొలి ప్రేమ’ తర్వాత ‘ఖుషి’ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం దక్కింది. అది కూడా భారీ విజయం సాధించింది. అప్పుడు కూడా కళ్యాణ్‌‌తో సినిమా చేయాలన్న బలమైన కోరిక పుట్టింది.

నేను నిర్మాతగా మారాక ‘ఆర్య’ సినిమా ఓపెనింగ్‌కు పవన్ వచ్చారు. అప్పుడు కూడా కళ్యాణ్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలని అనుకున్నా. నేను నిర్మాతగా తర్వాత చాలామంది స్టార్లతో సినిమాలు చేసినా పవన్‌తో సినిమా చేయలేదే అనిపిస్తూనే ఉండేది. రకరకాల కారణాల వల్ల అది సాధ్యపడలేదు. కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఇక మన కల తీరదేమో అనుకున్నా. రెండేళ్ల ముందు ‘పింక్’ సినిమా తమిళ ట్రైలర్‌ను బోనీ కపూర్ గారు నాకు పంపించారు. అది చూస్తే అజిత్ స్థానంలో నాకు కళ్యాణే కనిపించారు.

ఆ ట్రైలర్ గురించి హరీష్‌కు చెబితే.. కళ్యాణ్ చేస్తే ఈ సినిమా అదిరిపోతుందన్నారు. తర్వాత ‘అల వైకుంఠపురములో’ సెట్లో త్రివిక్రమ్ గారికి ఈ ఐడియా గురించి చెబితే కళ్యాణ్‌కు కలిసే అవకాశం కల్పించారు. ‘పింక్’ రీమేక్ గురించి చెబితే ఆయన చేద్దామన్నారు. తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్‌‌కు చెబితే.. కళ్యాణ్ అభిమాని అయిన అతను.. ఆయన ఇమేజ్‌ దెబ్బ తినకుండా, పింక్ కాన్సెప్ట్ చెడకుండా అద్భుతమైన స్క్రిప్టు తయారు చేశాడు. ఇలా కళ్యాణ్‌తో సినిమా చేయాలన్న నా కల నెరవేరింది” అని రాజు వెల్లడించాడు.