తిరుపతి ఉప పోరులో ‘గ్లాసు’ గుర్తు.. అదెలా సాధ్యం?

ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచేలా మారిన తిరుపతి ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ బరిలో నిలవటం.. ఆమె తరఫున జనసేన అధినేత పవన్ భారీగా ప్రచారాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. తన ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్. దీంతో అధికార పార్టీ వర్సెస్ పవన్ అన్నట్లుగా పోరు నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన అభ్యర్థులకు కేటాయించే గ్లాసు గుర్తును.. తాజా ఉప పోరులో నవతరం పార్టీకి చెందిన అభ్యర్థికి ఎన్నికల అధికారులు కేటాయించారు. ఎందుకిలా? అంటే.. ఇప్పటివరకు జనసేనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా లేదు. అలాంటివేళలో.. అలాంటి పార్టీల గుర్తు.. మరే ఇతర అభ్యర్థులకైనా కేటాయించే వీలుంది.

తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. జనసేన అభ్యర్థి బరిలో లేకపోవటంతో.. ఎన్నికల అధికారులు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. అయితే.. ఇదంతా వైసీపీ చేసిన రాజకీయ కుట్రగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. అయితే.. ఈ ఆరోపణల్ని ఎన్నికల సంఘం అధికారులు కొట్టి పారేస్తున్నారు. నిబంధనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల్నే అభ్యర్థులకు కేటాయించామని చెబుతున్నారు.

నిజమే.. రూల్ పొజిషన్ ప్రకారం గ్లాసు గుర్తు కేటాయించి ఉండి ఉండొచ్చు.కానీ.. జనసేన పార్టీ ఒకటి ఉందని.. దానికి గ్లాసు గుర్తు అల్రెడీ కేటాయిస్తుంటారన్న విషయం తెలియని అధికారి ఎవరూ ఉండరు. అయినా.. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తులు బోలెడన్ని ఉండగా.. గ్లాసు గుర్తునే ఎన్నికల అధికారులు కేటాయించటంలో మతలబు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. కోరి వివాదాల్ని నెత్తిన వేసుకున్నట్లుగా అధికారుల తీరు ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఏమైనా.. గ్లాసు గుర్తు బరిలోకి వచ్చేయటం.. బీజేపీ నేతలకు గుబులు పుట్టిస్తోంది.