హైదరాబాద్‌లో ఐపీఎల్?

కరోనా నేపథ్యంలో ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ వేదికల్ని ఆరుకు పరిమితం చేయడం.. ఎప్పుడూ ఐపీఎల్ జరిగే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను వేదికల జాబితా నుంచి తప్పించడం తెలిసిన సంగతే. ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు అహ్మదాబాద్‌ల్లో మాత్రమే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉండే దేశంలోనే అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కాకపోతే స్టేడియాలకు ఎలాగూ అభిమానులను అనుమతించడం లేదు కాబట్టి ఈ విషయాన్ని మరీ సీరియస్‌గా తీసుకోలేదు ఎవ్వరూ. ఐతే మన స్టేడియంలో ఐపీఎల్ సందడి లేదే అనే అసంతృప్తి మాత్రం ఉంది. కాగా అనూహ్య పరిణామాల మధ్య ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ముస్తాబవుతుండటం విశేషం.

ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం సన్నద్ధంగా ఉండాలని బీసీసీఐ నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం పెద్దలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇదంతా ముంబయిలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో జరిగిన మార్పు. దేశం మొత్తంలో ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలో ఆ స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్‌ను మించి ఇప్పుడు అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ స్థితిలో అభిమానులు లేకుండా అయినా ముంబయిలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం ప్రమాదమే అని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి హోటళ్లు సహా ఏవీ సురక్షితం కాదన్న ఉద్దేశంలో అవసరమైతే ప్రస్తుతం బయో బబుల్లో ఉన్న ఆటగాళ్లను ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలించి వాంఖడెలో జరగాల్సిన మ్యాచ్‌లు అన్నింటినీ ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందట. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ.. బ్యాకప్‌గా ఉప్పల్ స్టేడియాన్ని పెట్టుకుని, ఇక్కడి వాళ్లకు దేనికైనా రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.