సైన్యం ఎంతమంది పిల్లలను చంపేసిందో తెలుసా ?

మయున్మార్ లో 43 మంది చిన్నారులను చంపేశారు. గడచిన నాలుగురోజులుగా సైన్యానికి, ప్రజలకు మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో చట్టబద్దంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీతో పాటు మరికొందరిని సైన్యం నిర్భందించి జైళ్ళల్లో పెట్టింది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యాధికారులే మయున్మార్ పాలనా పగ్గాలను చేతిలోకి తీసుకున్నారు.

సైన్యం చర్యతో రెచ్చిపోయిన జనాలు వెంటనే రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారు. రోడ్లపైకి రావద్దని, ఆందోళనలు చేయవద్దని సైన్యం చెప్పిని వినకుండా జనాలు రోడ్లపైకి వచ్చి దేశమంతా ఆందోళనల్లోకి దిగారు. దాంతో సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. గడచిన నాలుగు రోజులుగా 600 మందకి పైగా సైన్యం, పోలీసుల కాల్పుల్లో మరణించారు.

బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో 43 మంది చిన్న పిల్లలు కూడా ఉండటం. మరణించిన వారిపై సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్చంధ సంస్ధ సర్వేచేసింది. చనిపోయిన వారిలో 16 ఏళ్ళలోపు వారు 30 మందున్నారట. 13 ఏళ్ళ చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుంటే అకారణంగా సైన్యం కాల్పులు జరిపి చంపేసిందని సంస్ధ ఆరోపించింది.

మండలేలో కూడా 14 సంవత్సరాల అబ్బాయి ఇంటిముందున్నపుడు సైన్యం కాల్చి చంపేసిందట. కరేన్ తెగ ఎక్కువగా ఉండే గ్రామంపై సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది పిల్లలు చనిపోయినట్లు సంస్ధ ప్రతినిధులు వెల్లడించారు. ఇళ్ళల్లోనే ఉన్నవారిపైన కూడా దాడులు జరిపి కాల్చి చంపేస్తున్నారంటే సైన్యం+పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమైపోతోంది. అంతర్జాతీయ సమాజం ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సైన్యం, పోలీసులు ఎవరినీ లెక్కపెట్టడంలేదు. మరి ఈ దమనకాండ ఎంతకాలం సాగుతుందో ఏమో.