లోక్ సభలో విజయం కోసం సరికొత్త వ్యూహం

ఎలాగైనా సరే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. జనాలు దగ్గరవ్వటానికి భారీ బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల వంటివాటికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యింది. దీని స్ధానంలో ఇంటింటికి ప్రచారం అనే కాన్సెప్టును బలంగా ముందుకు తీసుకొస్తోంది. ఎన్నికలు ముగిసేలోగా ప్రతి ఇంటిని కనీసం పదిసార్లయినా టచ్ చేయాలనే టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నది పార్టీ అగ్రనాయకత్వం.

పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతల విజయానికి ఇంటింటికి ప్రచారం అనే వ్యూహమే ప్రధాన కారణంగా టీడీపీ గుర్తించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి తెలిసేలా వైసీపీ నేతలు గట్టి వ్యూహంతో ముందుకెళ్ళారు. వీళ్ళకు గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ బాగా సహకరించిందన్న విషయాన్ని టీడీపీ గుర్తించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వ పథకాల గురించి జనాలకు పదే పదే గుర్తుచేశారు.

సో వైసీపీ ప్రచార పద్దతిని గుర్తించిన టీడీపీ కూడా తన రూటును మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకనే లోక్ సభ నియజకవర్గాన్ని 70 క్లస్టర్లుగా విభజించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని క్లస్టర్లకు సుమారు 25 వేలమంది కార్యకర్తలను కేటాయించబోతోంది. వీరితో నేతలను సమన్వయం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. వీరందరి సహకారంతో క్లస్టర్లలోని కార్యకర్తలు, నేతలు ప్రతి ఇంటిని టచ్ చేయాలనే టార్గెట్ ను ఫిక్స్ చేసింది.

పోలింగ్ జరిగేలోగా ప్రతి ఇంటిని పదిసార్లు టచ్ చేసి అధికారపార్టీ చేస్తున్న ధౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి పాలనలోని దురాగతాలను జనాలందరికీ వివరించబోతున్నది. గతంలో ఇలాంటి పనులు చేయటానికి బూత్ కమిటీలుండేవి. అయితే వివిధ కారణాలతో ఆ విధానం దెబ్బతినేసింది. అయితే లోక్ సభ ఉపఎన్నికల కారణంగా మళ్ళీ అదే బూత్ కమిటిల వ్యవస్ధను తిరిగి యాక్టివేట్ చేయబోతున్నది టీడీపీ అగ్రనాయకత్వం. మరి తన పద్దతిలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.