టీడీపీపై రెండు రకాలుగా దెబ్బపడిందా ?

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల టీడీపీ రెండు రకాలుగా నష్టపోతోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేసినపుడే పార్టీ క్యాడర్ గట్టిగా ఉంటుంది. అసలు ఎన్నికలనే బహిష్కరించినపుడు పార్టీ స్ధానిక నేతలు, క్యాడర్ ఇతర పార్టీల వైపు వెళిపోయే ప్రమాదం ఉంది. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇపుడు జరగబోయేది అదేని పార్టీ సీనియర్ నేతల్లో ఆందోళన మొదలైంది.

ఎన్నికల్లో పోటీచేయాలని ఉన్నప్పటికీ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామందిలో అసంతృప్తి పెరిగిపోతోంది. పార్టీ నేతల అంతర్గత చర్చల్లో తెలుస్తున్నదేమంటే అసంతృప్త నేతలు, క్యాడర్ జనసేన+బీజేపీ కూటమిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందట. చంద్రబాబు నిర్ణయం పార్టీని రెండు రకాలుగా దెబ్బ తీస్తోందట. మొదటిదేమో తాము అధికారంలో ఉన్నపుడు తీసుకున్న నిర్ణయం. రెండోదేమో ప్రతిపక్షంలోకి వచ్చినాక తీసుకున్న నిర్ణయం.

మొదటి నిర్ణయాన్ని తీసుకుంటే ఇపుడు జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలు టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరగాల్సినవి. అప్పట్లోనేమో జనాల్లో వ్యతిరేకత బయటపడుతుందనే భయంతో ఎన్నికలు జరపలేదు. హైకోర్టు ఎన్నికలు జరపాలని ఆదేశించినా లెక్క చేయకుండా ఎన్నికలను వాయిదా వేశారు. చివరకు భయపడినంతా జరిగి సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయంతో స్ధానికనేతలు, క్యాడర్ మనోస్ధైర్యం దెబ్బ తినబోతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడాలని నేతలు, క్యాడర్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిజానికి పాలిట్ బ్యూరో సమావేశంలోని నేతల్లో చాలామందికి ప్రజాజీవితంతో సంబంధమేలేదు. అలాంటి వాళ్ళే ఇపుడు చంద్రబాబు తరపున పార్టీలో చక్రం తిప్పుతున్నారు.

జనబలం లేని, ఎన్నికల్లో గెలిచి దశాబ్దాలు అయిపోయిన కొద్దిమంది నేతలే పాలిట్ బ్యూరోలో మిగిలిన వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు పార్టీలోని నేతలు, క్యాడర్ మనోభావాలను చంద్రబాబుకు వివరించాల్సిందిపోయి అధినేత ఆలోచనలకు తగ్గట్లుగా మిగిలిన నేతలతో మాట్లాడుతున్నారు. దీనివల్లే ఇపుడు చంద్రబాబు నిర్ణయంపై చాలామంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో మండిపోతున్నారు.

ఇలాంటి కీలకమైన నిర్ణయాలను పాలిట్ బ్యూరోలో కాకుండా జిల్లాల్లోని నేతలతో కూడా చర్చించి తీసుకోవాలని అశోక్ గజపతిరాజు సూచనే నేతల్లోని అసంతృప్తిని బయటపెడుతోంది. అధినేత నిర్ణయంతో విభేదించి ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పదవికి రాజీనామా చేశారు. ఇంకెంతమంది బయటపడతారో చూడాల్సిందే.