ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కానీ త‌ప్ప‌దు


క‌రోనా విరామం త‌ర్వాత టాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే రిలీజ‌వుతున్న తొలి భారీ చిత్రం వ‌కీల్ సాబ్‌. మామూలుగానే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమా రిలీజ‌వుతుంటే అభిమానుల‌ హంగామా మామూలుగా ఉండ‌దు. అలాంటిది అత‌ను మూడేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని.. రీఎంట్రీ ఇస్తుండ‌టంతో ఫ్యాన్స్ వెర్రెత్తిపోయి ఉన్నారు. ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టితో పోలిస్తే.. రిలీజ్ స‌మ‌యానికి భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి.

ప‌వ‌న్ రీఎంట్రీ మూవీని ఎలా సెల‌బ్రేట్ చేయాల‌నుకుంటున్నారో మొన్న ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా శాంపిల్ చూపించారు. అప్పుడే అలా ఉంటే సినిమా రిలీజ్ టైంలో ఇంకెలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. కానీ ప‌వ‌న్ అభిమానులు ఉత్సాహానికి బ్రేకులు వేసేలా ఉంది క‌రోనా మ‌హమ్మారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసిన బెనిఫిట్/అద‌న‌పు షోలు ఏవీ కూడా సాధ్య‌ప‌డే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ గ‌ట్టి ప్ర‌భావం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో సినిమాల‌కు వంద శాతం ఆక్యుపెన్సీని కొన‌సాగించే విష‌యంలోనూ పున‌రాలోచ‌న చేసే ప‌రిస్థితి నెల‌కొంది. అలాంటిది బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోలు అంటే చాలా క‌ష్టం. కాబ‌ట్టి అర్ధ‌రాత్రి నుంచి ఏపీలో పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయ‌డానికి ప్లాన్ చేసుకున్న అభిమాన సంఘాల వాళ్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బే.

తెలంగాణ‌లో ఐదో షోకు అనుమ‌తులు రావ‌డం అసాధ్యం అనే అంటున్నారు. మ‌రోవైపు క‌రోనా నేప‌థ్యంలో ఇంత‌కుముందు అనుకున్న‌ట్లు భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఏమీ నిర్వ‌హించేలా లేరు. మ‌రీ ఈవెంటే లేదు అనిపించ‌కుండా.. ఒక స్టార్ హోట‌ల్లో అభిమానులెవ‌రూ లేకుండా సింపుల్‌గా ఈవెంట్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ ప‌రిణామాలు అభిమానుల‌కు నిరాశ క‌లిగించిన‌ప్ప‌టికీ.. వేరే రాష్ట్రాల్లో అస‌లు ఆక్యుపెన్సీనే త‌గ్గించేస్తుండ‌టం, సినిమాల ప్ర‌ద‌ర్శ‌నే ఆపేయాల‌ని చూస్తున్న నేప‌థ్యంలో ఈమాత్ర‌మైనా ఉన్నందుకు సంతోషించాల్సిందే.