ప‌వ‌న్ ప్రొడ‌క్ష‌న్లో 15 సినిమాలు


రీఎంట్రీలో శ‌ర‌వేగంగా సినిమాలు చేసుకుపోతున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ పూర్తి కాగా.. హ‌రిహ‌ర వీర మ‌ల్లుతో పాటు అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేక్‌లో స‌మాంత‌రంగా న‌టిస్తున్నాడాయ‌న‌. హ‌రీష్ శంక‌ర్, సురేంద‌ర్ రెడ్డిల సినిమాలు కూడా లైన్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ కోసం మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎదురు చూస్తున్నారు.

రాజ‌కీయాల్లో పూర్తి స్థాయిలో కొన‌సాగుతూనే హీరోగా ఇంత బిజీగా ఉన్న ప‌వ‌న్.. నిర్మాత‌గా భారీ ప్ర‌ణాళిక‌ల‌తో రంగంలోకి దిగుతుండ‌టం విశేషం. ఆయ‌న నిర్మాణ సంస్థ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌లో ఏకంగా 15 సినిమాలు రాబోతున్నాయ‌న్న సమాచారం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్లో చిన్న‌, మీడియం రేంజ్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న‌ పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్ర‌సాద్‌తో ప‌వ‌న్ చేతులు క‌లిపాడు. ఇండ‌స్ట్రీలో కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తూ ప‌వ‌న్, విశ్వ‌ప్ర‌సాద్ క‌లిసి వ‌రుస‌గా సినిమాలు నిర్మించ‌బోతున్నార‌ట‌. వీరి క‌ల‌యిక‌లో ఏకంగా 15 సినిమాలు రాబోతుండ‌టం విశేషం. ఇందులో ఆరు చిన్న సినిమాలు కాగా.. ఆరు మీడియం రేంజ్ చిత్రాల‌ట‌. రెండు భారీ సినిమాలు కూడా వీరి క‌ల‌యిక‌లో రాబోతున్నార‌ట‌. ఈ మేర‌కు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.

త‌న పేరిట ప‌వ‌న్ చాలా ఏళ్ల కింద‌టే బేన‌ర్ పెట్టాడు కానీ.. దాన్నెప్పుడూ అంత యాక్టివ్‌గా ఉంచ‌లేదు ప‌వ‌న్. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను ఈ బేన‌ర్లోనే చేయాల‌ని అనుకున్నాడు కానీ.. త‌ర్వాత బండ్ల గ‌ణేష్‌కు నిర్మాణ బాధ్య‌తలు ఇచ్చేశాడు. ఇప్ప‌టిదాకా ప‌వ‌న్ బేన‌ర్లో ఒక్క సినిమా కూడా రాలేదు. చ‌రణ్ హీరోగా ప‌వ‌న్ ఓ సినిమాను నిర్మిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ.. అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి ప్రొడ‌క్ష‌న్లోకి ప‌వ‌న్ ఇంత సీరియ‌స్‌గా దిగడం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.