సొంతపార్టీకే షాకిచ్చిన కేంద్రం..పాండిచ్చేరికి స్పెషల్ స్టేటస్

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలో సొంతపార్టీకే కేంద్రప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఐదురాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వాటిల్లో పాండిచ్చేరి కూడా ఒకటి. దీనికి పూర్తిస్ధాయి రాష్ట్రం హోదాలేదు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటునే కొంతమేర రాష్ట్రహోదాను అనుభవిస్తోంది. ఇలాంటి రాష్ట్రంలో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టంచేసింది.

2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలనేది కీలకం. అలాంటిది ఎన్డీయే అధికారంలోకి రాగానే నరేంద్రమోడి సర్కార్ ఏపి ప్రయోజనాలను దెబ్బకొట్టింది. ఎంతో కీలకమైన ప్రత్యేకహోదాను ఇచ్చేదిలేదని తేల్చిచెప్పేసింది. ప్రత్యేకహోదా విషయాన్ని కేంద్రమంత్రులు మాట్లాడుతు హోదా అనేది ముగిసిన అధ్యాయమని, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చాలాసార్లు చెప్పారు.

ఒకవైపు ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేదిలేదని, దేశంలో ఏ రాష్ట్రానికీ ఇచ్చేదిలేదని చెప్పిన ఇదే కేంద్రప్రభుత్వం తాజాగా పాండిచ్చేరికి మాత్రం స్పెషల్ క్యాటగిరి ఇస్తామని హామీ ఎలా ఇచ్చిందో అర్ధం కావటంలేదు. అంటే తమకు ఉపయోగం ఉంటే ఒకలాగ ఉపయోగం ఉండదని అనుకుంటే మరోలాగ మాట్లాడుతారని తాజాగా అర్ధమైపోయింది. ప్రత్యేకహోదా ఇచ్చినా, ఇవ్వకపోయినా ఏపిలో బీజేపీ పరిస్దితి ఒకటే అని మోడికి బాగా అర్ధమైపోయింది.

పాండిచ్చేరికి వచ్చేసరికి బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలుపుకుంటుందో లేదో భగవంతుడికే తెలియాలి. ముందైతే జనాలను ఆకర్షించేందుకు ప్రత్యేకహోదాను హామీగా ఇచ్చేసింది. పాండిచ్చేరిలో ఇచ్చిన ప్రత్యేకహోదా ప్రామిస్ వెంటనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై పడింది. ఈ ఉపఎన్నికలో ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కమలం నేతలు చెబుతున్నారు.

ఒకవైపు బీజేపీ నేతలు హోదా విషయాన్ని కొట్టిపాడేస్తున్న సమయంలోనే పక్కనే ఉన్న పాండిచ్చేరికి ప్రత్యేకహోదా హామీని మ్యానిఫెస్టోలో పెట్టడమంటే గెలుపుపై కేంద్రమే పెద్ద బండ వేసినట్లే అనుకోవాలి. మరి తిరుపతి ప్రచారంలో ఉన్న నేతలు పాండిచ్చేరిలో ఇఛ్చిన హామీని ఎలా సమర్ధించుకుంటారో ? టీవీల్లో, మీడియా సమావేశాల్లో అడ్డదిడ్డంగా పార్టీ చర్యను సమర్ధించుకోవచ్చు. కానీ ప్రచారంలో జనాలను ఎలా కన్వీన్స్ చేస్తారో చూడాలి.