దానికి కూడా ఆయ‌నే ముహూర్తం పెట్టారా? వైసీపీ నేత‌ల టాక్‌!

ఏపీలో వైసీపీ స‌ర్కారుకు.. విశాఖలోని చిన‌ముషిడివాడ‌లో ఉన్న స్వామి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తికి మ‌ధ్య ఉన్న లింకు అంద‌రికీ తెలిసిందే. వైసీపీ అధినేతగా ఉన్న జ‌గ‌న్‌ను ఏపీలో అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు స్వ‌రూపానంద య‌జ్ఞాలు, యాగాలు, హోమాలు.. పూజ‌లు ఇలా.. అనేక రూపాల్లో క‌ష్ట‌ప‌డ్డారు. ఇక‌, ఈయ‌న క‌నుస‌న్న‌ల్లోనే సీఎం జ‌గ‌న్ న‌డుస్తున్నార‌నేది కూడా బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. చాలా విష‌యాల్లో ముహూర్తాలు.. నిర్ణ‌యాలు అన్నీ కూడా స్వామి ఆదేశాల‌మేర‌కు ఆశీస్సుల‌ మేర‌కే జ‌రుగుతున్నాయ‌నే విష‌యం కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తోంది.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం.. స‌హా జ‌గ‌న్ తీసుకున్న అనేక నిర్ణ‌యాల వెనుక కూడా స్వామి పాత్ర ఉందనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అదేవిధంగా త‌ర‌చుగా ముఖ్య‌మంత్రి, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు సైతం.. స్వామిని ద‌ర్శించుకుని త‌మ అభీష్టాలు తీర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు కీల‌క‌మైన తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి కూడా స్వామి త‌న‌దైన ముహూర్తం పెట్టార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం ఈవిష‌యం ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటు న్నారు.

తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రుగుతున్న ఉప పోరులో డాక్ట‌ర్ గురుమూర్తికి జ‌గ‌న్ టికెట్ కన్ఫ‌ర్మ్ చేశారు. అయితే.. ఆయ‌న త‌న నామినేష‌న్‌ను ఈ నెల 29న అంటే .. సోమ‌వారం దాఖ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఆ రోజే దాఖ‌లు చేయ‌డం వెనుక ఉన్న విశేషం ఏంట‌నే చ‌ర్చ పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌జ‌రిగింది. దీనికి స్వామి ముహూర్తం పెట్టార‌ని.. పౌర్ణ‌మి త‌ర్వాత వ‌చ్చే పాడ్య‌మి తిధి, సోమ‌వారం, హ‌స్త న‌క్ష‌త్రం వంటివి గురుమూర్తికి క‌లిసివ‌స్తాయ‌ని.. అందుకే ఆ రోజు ఉద‌యం 11 గంట‌లు లేదా మ‌ధ్యాహ్నం 2 త‌ర్వాత నామినేష‌న్ స‌మ‌ర్పించాల‌ని స్వామి ఆదేశాలు ఇచ్చార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం గురుమూర్తి కూడా ఆదిశ‌గానే ఏర్పాట్లు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి స్వామి వారి ఆశీస్సులు ప్ర‌బుత్వంపైనే కాకుండానే అభ్య‌ర్థుల‌పైనా ఉండ‌డం గ‌మ‌నార్హం.