వైష్ణ‌వ్ తేజ్.. ఒక ఇంట్రెస్టింగ్ మూవీ


టాలీవుడ్లో మ‌రే హీరోకూ దొర‌క‌ని ఎంట్రీ ల‌భించింది మెగా కుర్రాడు పంజా వైష్ణ‌వ్ తేజ్‌కు. మెగాస్టార్ వార‌సుడిగా భారీ అంచ‌నాల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చ‌ర‌ణ్.. తొలి సినిమా చిరుత‌తో నెల‌కొల్పిన రికార్డును కేవ‌లం మూడు రోజుల్లో వైష్ణ‌వ్ డెబ్యూ మూవీ ఉప్పెన బ‌ద్ద‌లు కొట్టేసింది. అప్ప‌టికి, ఇప్ప‌టికి టికెట్ల రేట్లు పెరిగి ఉండొచ్చు. ప‌రిస్థితులు చాలా మారి ఉండొచ్చు. అయినా స‌రే.. చిరుత రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాదు.. ఏకంగా వంద కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి ఔరా అనిపించింది ఈ సినిమా.

మిగతా అరంగేట్ర హీరోల్లాగా మాస్-యాక్ష‌న్ మూవీ చేయ‌కపోయినా.. ఒక ప్రేమ‌క‌థ‌తో ఇలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకోవ‌డం అనూహ్యం. పైగా ఇందులో వైష్ణ‌వ్ డీగ్లామ‌ర‌స్ రోల్ చేశాడు. ఉప్పెన భారీ విజ‌యాన్నందుకోవ‌డంతో వైష్ణ‌వ్‌తో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు వ‌రుస క‌డుతున్నారు.

ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ త‌న రెండో చిత్రాన్ని పూర్తి చేయ‌గా.. నాగార్జున నిర్మాణంలో అత‌నో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. అలాగే జాతిర‌త్నాలు ద‌ర్శ‌కుడు అనుదీప్‌తోనూ ఓ సినిమా అన్నారు. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర ప్రాజెక్టుకు వైష్ణ‌వ్ సంత‌కం చేసిన‌ట్లు స‌మాచారం. అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసి.. ఆ చిత్రాన్ని త‌మిళంలో ఆదిత్య‌వ‌ర్మ పేరుతో విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోగా రీమేక్ చేసి హిట్టు కొట్టిన గిరీశ‌య్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

సీనియ‌ర్ నిర్మాత‌, మెగా కుటుంబానికి స‌న్నిహితుడైన బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. మెహ‌బూబాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానున్న కేతిక శ‌ర్మ ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. వైష్ణ‌వ్ మూడో సినిమా ఇదే కానుంద‌ని స‌మాచారం.