చింతా మోహ‌న్ ఎంట్రీ.. కాంగ్రెస్‌కు చింత తీరుతుందా ?

రాష్ట్రంలో పూర్తిస్థాయిలో చ‌తికిల ప‌డిన కాంగ్రెస్‌.. మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు పుంజుకుంటుందా ? పున‌ర్వైభ‌వం సంత‌రించుకోక‌పోయినా.. కొంత మేర‌కు పుంజుకునే స్థాయికి ఎదుగుతుందా ? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి చింత చిగురు చిగురించినంత ఆశ అయితే ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్థితి ఏపీలో దారుణంగా త‌యారైంది. ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్ జారిపోవ‌డం, నాయ‌కులు పార్టీ మారిపోవ‌డం తెలిసిందే. ఫ‌లితంగా ఏ చిన్న ఎన్నిక జ‌రిగినా… కాంగ్రెస్ ప‌రిస్థితి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికి రెండు సార్లు జ‌రిగిన సార్వ‌త్రిక స‌మ‌రంలోనూ ఒక్క చోట కూడా గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్లు కూడా ద‌క్కించుకోలే కపోయింది.

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక‌, పంచాయ‌తీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ పార్టీ తీవ్రంగా దెబ్బ‌తింది. అయితే.. తాజాగా జ‌రుగుతున్న తిరుపతి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో మాత్రం ఒకింత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది. మాజీ ఎంపీ.. తిరుప‌తిపై ప‌ట్టున్న నాయకుడు చింతా మోహ‌న్‌కు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఆయ‌న తిరుప‌తి లోక్‌స‌భ సీటు ప‌రిధిలో పేరున్న నేత‌గా ఉన్నారు. దీంతో ఆయ‌న ఇక్క‌డ నుంచి ఉప ఎన్నిక‌లో పోటీకి దిగుతున్నారు. ఇక‌, మోహ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం నుంచి తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. రాష్ట్ర విభ‌‌జ‌న త‌ర్వాత మాత్రం ఆయ‌న వ‌రుస ఓట‌ములు ఎదుర్కొంటు న్నారు.

2014 ఎన్నిక‌ల్లో చింతా మోహ‌న్‌కు కేవ‌లం 33 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి.. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో అంటే 2019లో ఈ సంఖ్య 24 వేల‌కు దిగ‌జారిపోయింది. అయినా కాంగ్రెస్ ఇంత దారుణంగా చితికిపోయినా చింతాకు ఈ స్థాయిలో ఓట్లు రావ‌డం గొప్పే అనుకోవాలి. రాజ‌కీయంగా చూసుకుంటే.. త‌న వాగ్దాటితో తిరుప‌తి స‌మ‌స్య‌ల‌నే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌స్య‌ల‌పై చింతా స్పందిస్తున్నారు. దీనికి మేధావుల నుంచి కూడా మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఈ రెండేళ్ల గ్యాప్‌లో చింతా కొంత మేర‌కు పుంజుకున్నారు. ఏపీ ఎదుర్కొంటోన్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తుతూ ఉన్నారు.

ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందుగానే ఆయ‌న తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానంపై ఫోక‌స్ పెంచారు. నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నాయ‌కుల‌ను.. కీల‌క పారిశ్రామిక వ‌ర్గాల‌ను కూడా చేరువై.. త‌న గెలుపున‌కు కృషి చేయాల‌ని కోరారు. ఇక పాత‌త‌రం నాయ‌కులు, ప్ర‌జ‌ల‌తో ఉన్న సంబంధాల‌ను ఆయ‌న బాగా వాడుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఇక్క‌డ గెలవ‌క‌పోయినా.. గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్లు ద‌క్కించుకుంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.