సైన్యం రెచ్చిపోయింది..114 మంది చనిపోయారు

మయున్మార్లో సైన్యం రెచ్చిపోయింది. సైనికపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన చివరకు హింసాత్మకంగా మారిపోయింది. ప్రజలకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణ చివరకు తారాస్ధాయికి చేరుకున్నది. సహనం కోల్పోయిన సైన్యం జరిపిన కాల్పుల్లో 114 మంది మరణించటం అంతర్జాతీయస్ధాయిలో సంచలనంగా మారింది. సైన్యం కాల్పుల్లో ఇంతమంది ఒకేరోజు చనిపోవటం బహుశా ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద హింసా ఘటనగా చెప్పుకుంటున్నారు.

చాలా కాలంగా మయున్మార్ సైనికపాలనలోన మగ్గుతోంది. జరిగిన ఎన్నికలను కూడా సైన్యాధికారులు లెక్కచేయలేదు. దాంతో మొత్తం దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టేసుకున్నారు. సైన్యం చర్యలకు వ్యతిరేకంగా, సైన్యంపాలనను నిరసిస్తు దేశవ్యాప్తంగా జనాలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇది హింసాత్మకంగా కూడా అవుతోంది. అయితే శనివారం 76వ సైనికదినోత్సవం జరిగింది.

కాబట్టి శనివారం జనాలు మరింతగా తిరగబడే ప్రమాదాన్ని ముందుగా ఊహించిన సైన్యాధికారులు జనాలను రోడ్లపైకి రావద్దని శుక్రవారమే తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. రోడ్లపైకి వస్తే కాల్చేస్తామని కూడా వార్నింగులిచ్చారు. అయినా జనాలు పట్టించుకోకుండా శనివారం ఉదయం నుండే రోడ్లపైకి వచ్చేశారు. పెద్దఎత్తున రోడ్లపైకి చేరుకుని సైన్యానికి వ్యతిరేకంగా ర్యాలీలు, నినాదాలు మొదలుపెట్టారు. దీంతో అక్కడక్కడ ప్రజలు-సైన్యానికి మధ్య ఘర్ణణలు జరిగాయి.

రోడ్లపైకి రావద్దని చెప్పినా వినకుండా రావటమే కాకుండా తమనే ఎదిరిస్తున్నారన్న కోపంతో సైన్యం రగిలిపోయి ఆందోళనకారులపై కాల్పులు మొదలుపెట్టింది. దేశంలోని 40 ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో అధికారికంగా 114 మంది చనిపోయారు. అయితే ఈ సంఖ్య సుమారు 400 దాకా ఉండచ్చని స్ధానిక మీడియా చెబుతోంది. బుల్లెట్ గాయాలతో కొన్ని వందలమంది పారిపోయారని వారంతా ఏమయ్యారో తెలీదని అంటున్నారు.

బుల్లెట్ గాయాలైన కొందరు మణిపూర్ సరిహద్దుల్లోకి వచ్చేసి భారత్ లోకి ప్రవేశించారు. వీరిని గుర్తించిన మనసైన్యాధికారులు వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ఇలాంటి వాళ్ళు సరిహద్దుల్లో ఇంకెంతమందున్నారో ఎవరికీ తెలీటంలేదు. ఒకటిరెండు రోజులైతే కానీ గ్రౌండ్ రియాలిటి ఏమిటో బయటపడదని రెడ్ క్రాస్ లాంటి అంతర్జాతీయ సంస్ధలు అనుకుంటున్నాయి. మొత్తానిక సైన్యంకాల్పుల్లో మామూలు జనాలు చనిపోవటం బాధాకరమనే చెప్పాలి.