టీఆర్ఎస్ వ్యూహం..కాంగ్రెస్‌ను తొక్కేయ‌డ‌మే ల‌క్ష్య‌మా?

KCR

ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేనంత‌గా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మాజీ ప్ర‌ధాని దివంగ‌త పీవీ న‌ర‌సింహారావు భ‌జ‌న‌లో మునిగితేలుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను రాష్ట్ర పండుగ‌లా నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌.. ఇటీవ‌ల పీవీ కుమార్తె సుర‌భి వాణీదేవికి.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌డంతోపాటు.. గెలిపించుకున్నారు. అయితే.. పీవీ వ్య‌వ‌హారంలో కేసీఆర్ ఇంత‌టితో ఆగిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రిన్ని మేళ్లు చేయ‌డం ద్వారా.. తెలంగాణ‌లో ముఖ్యంగా.. ప‌లు కీల‌క జిల్లాల్లోను, హైద‌రాబాద్ సెటిల‌ర్ల‌నూ మార్కులుతో కొట్టేయ‌డంతోపాటు.. కాంగ్రెస్‌కు సంస్థాగ‌తంగా ఉన్న‌ ఓటు బ్యాంకును త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

వాణీకి.. చైర్మ‌న్ గిరీ!

ఇటీవ‌లే శాసనమండలి(గ్రాడ్యుయేట్‌) సభ్యులురాలిగా ఎన్నికైన వాణీదేవి విష‌యంలో కేసీఆర్ మ‌రింత లోతైన ఆలోచ‌న చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆమెకు ఆ పదవి చిన్నది అవుతుందని భావించిన కేసీఆర్.. ఏకంగా వాణీదేవిని మండలి చైర్మన్‌గా చేయాలని డిసైడ్ అయినట్లు టీఆర్ఎస్ కు చెందిన కీల‌క నేత‌ల మ‌ధ్యే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో పీవీకి ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు క్యాష్ చేసుకోలేక పోయింది. ఇక‌ముందు కూడా ఆ ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో పీవీ తాలూకు అభిమానుల‌ను, ఓటు బ్యాంకును కూడా తన ఖాతాలో వేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులోభాగంగానే వాణీదేవిని మండలి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టాలని భావిస్తున్న‌ట్టు టీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారు. ఈయన కూడా కాంగ్రెస్ నుంచి వ‌చ్చి కేసీఆర్‌కు జై కొట్టిన నాయ‌కుడే. ఇక‌, ఈయ‌న‌ పదవీ కాలం జూన్‌లో ముగుస్తుంది. వాణీదేవిని మండలి చైర్మన్‌గా చేసేందుకు ఇదే త‌గిన స‌మ‌యంగా కేసీఆర్ భావిస్తున్నారు.

అదేస‌మ‌యంలో పీవీ కుమారుడు ప్రభాకర్‌రావుకు నామినేటేడ్ ప‌ద‌విని ఇచ్చి గౌర‌వించాల‌ని కూడా కేసీఆర్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, ఇప్పటికే పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్‌ కేంద్రానికి సిఫారసు చేసిన విష‌యం తెలిసిందే. ఇలా మొత్తంగా చూస్తే.. పీవీ భ‌జ‌న వెనుక చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతూ.. కాంగ్రెస్‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించేసేందుకు పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు . అనంత‌రం.. బీజేపీ ఒక్క‌టే ఉంటుంది. సో.. చావో రేవో.. ఆ పార్టీతోనే తేల్చుకోవ‌చ్చ‌ని కేసీఆర్ కూడిక‌లు, తీసివేత‌లు వేసుకుంటున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.