రేర్ కఫుల్.. రూ.6కోట్లను ఇచ్చేసిన సామాన్యులు


కాలం మారింది. విలువలు మారాయి. తోటి మనుషుల వరకు ఎందుకు.. సుఖం కోసం సొంతోళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా చంపేసే పాడు కాలం వచ్చేసింది. తాము అనుకున్నది దక్కించుకోవటం కోసం దేనికైనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇప్పటి రోజుల్లో.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. విన్నంతనే ‘వావ్’ అనిపించే నిజాయితీ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.

కేరళలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఎర్నాకులానికి చెందిన స్మిజా దంపతులు లాటరీ టికెట్లు అమ్ముతుంటారు. రోజు మాదిరే వారి వ్యాపారం పూర్తి అయి ఇంటికి వెళ్లాలనుకున్నారు. ఆ రోజు ఆదివారం కావటం.. ఆ రోజుకు గడువు పూర్తి అయ్యే పన్నెండు టికెట్లు మిగిలిపోయాయి. తమ వద్దే ఉంచుకుంటే నష్టం వస్తుంది. అందుకే..తమ దగ్గర లాటరీ టికెట్లు తరచూ కొనే రెగ్యులర్ కస్టమర్లకు ఫోన్లు చేశారు.

అలా పాలచోటిల్ కు చెందిన చంద్రన్ కు ఫోన్ చేసి.. తమ వద్ద ఉన్న పన్నెండు టికెట్ల గురించి చెప్పారు. అతను సరేనని చెప్పి.. తన దగ్గర రూ.200లు లేవని.. తర్వాతి రోజు ఇస్తానని చెప్పాడు. దీంతో.. అతనికి లాటరీ టికెట్ల నెంబర్లను ఫోన్లో చెప్పేసి ఇంటికి వెళ్లారు.

తర్వాతి రోజున చూస్తే.. వారు చివర్లో అమ్మిన పన్నెండు టికెట్లలో ఒక దానికి రూ.6కోట్ల బంపర్ ప్రైజ్ వచ్చింది. నిజానికి లాటరీ టికెట్ వారి వద్దే ఉన్నప్పటికీ.. చెప్పిన మాటకు లోబడి.. రూ.6కోట్ల ప్రైజ్ వచ్చిన చంద్రన్ ఇంటికి వెళ్లి.. రూ.6కోట్ల టికెల్ అతనికి ఇచ్చేశారు. తమకు రావాల్సిన రూ.200 తీసుకొని వెళ్లారు.

ఇవాల్టి రోజుల్లో ఇంతటి నిజాయితీని కలలో కూడా ఊహించగలమా? డబ్బుల కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే రోజుల్లో చెప్పిన మాట మీద నిలిచిన స్మిజా దంపతులు రేర్ పీస్ గా చెప్పక తప్పదు. వీరి ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. వీరి గురించి తెలిసిన వారంతా వావ్ అనటమే కాదు.. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.