షర్మిలపై కేసు ఉపసంహరణకు టీ సర్కారు సిద్ధం!


అనూహ్య పరిణామాలకు వేదిక అవుతోంది తెలంగాణ రాష్ట్రం. కలలో కూడా ఊహించని రీతిలో దివంగత మహానేత వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం కావటం ఒక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె కొత్త పార్టీ వెనుక టీఆర్ఎస్.. బీజేపీలు ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

అలాంటిదేమీ లేదని.. అవన్నీ ఉత్త మాటలుగా షర్మిల ఖండిస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె ఒకటికి నాలుగుసార్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అప్పుడప్పుడు టీఆర్ఎస్ సర్కారు మీద.. కేసీఆర్ పాలన మీద విమర్శల చేస్తున్న షర్మిల తీరు చూసినప్పుడు.. ఇదంతా నిజమేమో అన్న భావన కలుగుతోంది.

నిప్పు లేనిది పొగ రాదన్న చందంగా.. షర్మిల కొత్త పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారన్న ప్రచారానికి బలం చేకూరే పరిణామం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా విజయమ్మ.. షర్మిల చేసిన ప్రచార సమయంలో నిబంధనల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన న్యాయ విచారణ ప్రస్తుతం నాంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతోంది.

కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన తాజా విచారణ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 2012లో నమోదైన ఈ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే.. దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఓవైపు రాజకీయాల్లో ప్రత్యర్థిని ఏ చిన్నఅవకాశం వచ్చినా నలిపేసే పరిస్థితుల్లో.. అల్రెడీ విచారణ జరుగుతున్న కేసును.. ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

నిజంగానే షర్మిల కొత్త పార్టీ వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్ ఏమైనా ఉందా? రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటం కోసం.. ఆయనే ముందస్తుగా ఆమెను తీసుకొచ్చి పార్టీ పెట్టిస్తున్నారా? అన్న ప్రచారానికి తాజా పరిణామం బలాన్ని చేకూర్చేలా ఉందన్న మాట వినిపిస్తోంది. కోర్టుకు చెప్పినట్లుగా కేసు ఉపసంహరణ పిటిషన్ ను ప్రభుత్వం దాఖలు చేస్తే.. అది కేసీఆర్ సర్కారును ఇరుకున పడేలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 31న జరగనుంది. మరే జరుగుతుందో చూడాలి.