అదేంది రఘురామ? రూ.237 కోట్లు దారి మళ్లించారా?

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నరసాపురం ఎంపీ వైసీపీ రెబల్.. రఘురామ క్రిష్ణం రాజు మరోసారి తాజా సంచలనంగా మారారు. ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. సొంత పార్టీ మీద అదే పనిగా విమర్శలు గుప్పించటంతో పాటు.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పడేసేలా వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. అలాంటి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. రఘురామ పేరు విన్నంతనే అధికార వైసీపీ నేతలు పళ్లు నూరే వైనం తెలిసిందే. నిత్యం నీతులు బోధించే ఆయనపై బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది? అన్న వివరాల్లోకి వెళితే.. వ్యాపారం కోసం బ్యాంకు నుంచి భారీగా అప్పు తీసుకున్న ఆయన.. ఆ మొత్తాన్ని దారి మళ్లించి అక్రమంగా లబ్థి పొందారన్న ఫిర్యాదు ఆయనపై ఉంది. బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న రూ.237.84 కోట్ల మొత్తాన్ని అక్రమంగా దారి మళ్లించినట్లుగా ఆయనపై ఆరోపనలు ఉన్నాయి.

చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఏఎంబీ బ్రాంచ్ కు చెందిన బ్యాంకు అధికారి రవిచంద్రన్ ఈ నెల 23న ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120బీ రెడ్ విత్ 420, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. నిందితులంతా కుమ్మక్కు కావటం.. నేరపూరిత కుట్ర.. మోసం.. ఫోర్జరీ.. ఫోర్జరీ పత్రాల్ని అసలైన వాటిగా చూపించటం లాంటి నేరాలకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.

నకిలీ స్టేట్ మెంట్లు.. వాస్తవంగా జరగని లావాదేవీల్ని జరిగినట్లుగా చూపించి.. బ్యాంకు కన్సార్షియం నుంచి వందల కోట్ల రూపాయిల్ని రుణాలుగా తీసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ ఈ నేరాలన్ని 2012 నుంచి 2017 మధ్య కాలంలో జరిగినట్లుగా తాము జరిపిన ఆడిట్ లో బయటకు వచ్చాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరి.. తనపై నమోదైన తాజా కేసుపై ఎంపీ రఘురామ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.