పాన్ ఇండియా.. కామెడీ అయిపోతోందే


ఏ ముహూర్తాన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిందో.. ఇక అప్పట్నుంచి ప్రతి ఒక్కరికీ ‘పాన్ ఇండియా’ పిచ్చి పట్టుకుంది. ఆ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి.. దాని హీరో సహా అందులో భాగమైన అందరికీ పాన్ ఇండియా గుర్తింపు రావడంతో తామూ అలా వెలిగిపోవాలని అందరూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అందులో విజయవంతమవుతున్న వాళ్లు పెద్దగా కనిపించడం లేదు.

‘బాహుబలి’ తర్వాత సౌత్ నుంచి ట్రై చేసిన పాన్ ఇండియా సినిమాలు చాలా వరకు దెబ్బ కొట్టాయి. పోస్ట్ బాహుబలి ఎరాలో ‘కేజీఎఫ్’ మినహాయిస్తే మరే సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్టవ్వలేదు. క్రేజ్ సంపాదించుకోలేదు. ‘కేజీఎఫ్’ కూడా అనుకోకుండా జనాలకు ఎక్కేసింది. రెండో భాగానికి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. కానీ మిగతా సినిమాలకు స్థానిక భాషల్లో మినహాయిస్తే బయట పెద్దగా గుర్తింపు రాలేదు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ మరో ‘బాహుబలి’ అవుతుందనుకున్నారు దాని మేకర్స్. కానీ ఆ చిత్రానికి తెలుగు రాష్ట్రాల అవతల ఆదరణ దక్కలేదు. ఇలా మరెన్నో సినిమాలు బోల్తా కొట్టాయి. తమ సినిమా స్థాయి ఏంటో చూసుకోకుండా ‘పాన్ ఇండియా’ రిలీజ్ అంటూ హంగామా చేస్తున్నారు కానీ.. వాటికి బౌండరీల అవతల కనీస స్థాయిలో కూడా గుర్తింపు రావట్లేదు. ఈ మధ్య మంచు విష్ణు సినిమా ‘మోసగాళ్ళు’కు కూడా పాన్ ఇండియా రిలీజ్ అంటూ హడావుడి చేశారు. కానీ ఆ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే జనాలు పట్టించుకోలేదు. ఇక బయట ఈ చిత్రం పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని లేదు.

విష్ణు తమ్ముడు మనోజ్ సైతం ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాకు పాన్ ఇండియా రిలీజ్ అంటున్నాడు. అతడి కెరీర్ ఏ స్థితిలో తెలిసిన వాళ్లకు ఇది విడ్డూరంగా అనిపిస్తోంది. అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’ సహా తెలుగులో ‘పాన్ ఇండియా’ బ్రాండుతో వస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల అవతల ఏమాత్రం స్పందన వస్తుందన్నది సందేహమే. బుధవారం ‘అర్జున్ చక్రవర్తి’ అంటూ కొత్త సినిమా ఒకటి బయటికి వచ్చింది. చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఆ సినిమా హీరో ఎవరో కొత్తవాడు. మేకర్స్ అందరూ కొత్త వాళ్లే. ఇలాంటి సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇది చూశాక ‘పాన్ ఇండియా’ అంటే మరీ కామెడీ అయిపోతోందని.. తెలుగులో సినిమా తీసి, వేరే భాషల్లో అనువాదం చేస్తే అది పాన్ ఇండియా సినిమా ఎలా అయిపోతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.