జాతీయ అవార్డుల్లో ఒక సైలెంట్ హీరో


రెండు రోజులుగా సినీ ప్రియుల చర్చలన్నీ జాతీయ అవార్డుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో కొన్నిటి పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ‘వెల్ డిజర్వ్డ్’ అంటున్నారు. కొన్ని అవార్డుల విషయంలో వ్యతిరేకతా కనిపిస్తోంది. ఆ సంగతలా వదిలేస్తే తెలుగులో జాతీయ అవార్డులు పొందిన రెండు సినిమాల గురించి కూడా అందరూ బాగానే చర్చించుకుంటున్నారు. కానీ ఈ అవార్డులు పొందిన వారిలో ఒక వ్యక్తి గురించి పెద్దగా డిస్కషన్ లేదు. ఒక నటుడికి అవార్డు వస్తే దాని గురించి ఇండస్ట్రీ హోరెత్తిపోతుంది. దర్శకుడు లేదా సంగీత దర్శకుడికి పురస్కారం దక్కినా దాని గురించి అందరూ చర్చించుకుంటారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. కానీ ఒక ఎడిటర్‌కు అవార్డు అనేసరికి దాని గురించి పెద్దగా చర్చే లేదు. మామూలుగానే సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగాల గురించి మాట్లాడుకునేటపుడు ఎడిటింగ్ గురించి జరిగే చర్చ తక్కువ.

ఎడిటర్ల ప్రతిభ గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోరు. ఇప్పుడు ‘జెర్సీ’ సినిమాకు ఎడిటింగ్ విభాగంలో జాతీయ పురస్కారం పొందిన నవీన్ నూలి గురించి కూడా సోషల్ మీడియాలో కానీ, బయట కానీ పెద్దగా డిస్కషన్ లేదు. సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన విభాగం ఎడిటింగ్ అని తెలిసినా ఇండస్ట్రీ జనాలు సైతం.. నవీన్ నూలికి పురస్కారం దక్కడం గురించి పెద్దగా స్పందించకపోవడం, అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

నిజానికి ఈసారి తెలుగు సినిమాలకు దక్కిన నాలుగు అవార్డుల్లో అత్యంత విలువైనది నవీన్‌కు దక్కిన పురస్కారమే. ఒక తెలుగు ఎడిటర్‌కు జాతీయ అవార్డుల్లో వ్యక్తిగత పురస్కారం దక్కినందుకు మనం గర్వించాలి. వేరే టెక్నీషియన్ అయితే సోషల్ మీడియాలో హంగామా చేయించుకునేవాడేమో కానీ.. నవీన్ మామూలుగా కూడా పెద్దగా హడావుడి చేసే వ్యక్తి కాదు. సైలెంటుగా తన పని తాను చేసుకుపోతుంటాడు. సినిమా వేడుకల్లో కూడా పెద్దగా కనిపించడు. నాన్నకు ప్రేమతో, ధ్రువ, రంగస్థలం,అరవింద సమేత లాంటి ఎన్నో భారీ చిత్రాలకు అతను ఎడిటింగ్ చేశాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రెండు నంది అవార్డులు కూడా సాధించిన నవీన్‌కు ఇప్పుడు ఏకంగా జాతీయ ఉత్తమ ఎడిటర్ పురస్కారం దక్కింది. ఈ సైలెంట్ హీరోను అభినందించడానికి ఇండస్ట్రీ జనాలు ఇప్పటికైనా ముందుకొస్తారేమో చూడాలి.