పవన్, ఎన్టీఆర్ సినిమాలపై క్లారిటీ


ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్లలో హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కచ్చితంగా ఉంటాయి. ఎస్.రాధాకృష్ణ ఆధ్వర్యంలో మొదలైన హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాలు వచ్చాయి ఈ సంస్థలో. సితార ఎంటర్టైన్మెంట్స్ దీని భాగస్వామ్య సంస్థే. అందులో మీడియం రేంజ్ సినిమాలు చేస్తుంటారు.

సితారలో తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. అలాగే దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన నవీన్ నూలి సైతం జాతీయ పురస్కారం పొందాడు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ మీడియాను కలిశాడు. ఐతే ‘జెర్సీ’ కంటే కూడా మీడియా నుంచి ఎక్కువగా ఆయనకు ప్రశ్నలు ఎదురైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌ల కొత్త చిత్రాల గురించి.

పవన్-రానా కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయనున్న కొత్త చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతోంది. మీడియా వారి ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమాల గురించి కీలకమైన అప్‌డేట్స్ ఇచ్చాడు నాగవంశీ.

పవన్-రానా సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయినట్లు అతను వెల్లడించాడు. ఔట్ పుట్ బాగా వస్తోందని.. ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబరులో విడుదల చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్లు తెలిపాడు. ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందనే విషయంలోనూ నాగవంశీ స్పష్టత ఇచ్చాడు. ఏప్రిల్ నెలాఖర్లో లేదా మే మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామన్నాడు. బహుశా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లే ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా సినిమాకు ముహూర్త కార్యక్రమం నిర్వహిస్తారన్నమాట.