అంత నవ్వించిన దర్శకుడి జీవితంలో కన్నీళ్లు


అనుదీప్ కేవీ.. ఇప్పుడు ఈ యువ దర్శకుడి చుట్టూనే తిరుగుతున్నాయి టాలీవుడ్ చర్చలన్నీ. ‘పిట్టగోడ’ అనే ఫ్లాప్ మూవీతో ఇతను దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఇలాంటి అరంగేట్రం తర్వాత ఇంకో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడం ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు. కానీ అతను స్వప్న సినిమా లాంటి పేరున్న సంస్థలో నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘జాతిరత్నాలు’ సినిమా తీశాడు.

ఈ సినిమాకు విడుదలకు ముందు ఎంత హైప్ వచ్చింది, రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలకు తెర తీస్తోందో తెలిసిందే. చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ జాతర చూశాక నిర్మాతలు.. అనుదీప్‌కు అడ్వాన్సులివ్వడానికి పోటీ పడుతున్నారు. ఐతే అతను ‘జాతిరత్నాలు’ నిర్మాతలతోనే తన తర్వాతి చిత్రాన్ని కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పుడు ప్రేక్షకులను ఇంతగా నవ్విస్తున్న అనుదీప్ జీవితంలో కన్నీళ్లకేమీ లోటు లేదట. చదువు మధ్యలో వదిలేసి సినీ రంగం వైపు అడుగులేసిన తనకు కష్టాలే ఆహ్వానం పలికినట్లు అతను వెల్లడించాడు. తన ఊరు వదిలి హైదరాబాద్‌కు వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అనుదీప్. ఐతే తాను ఇక్కడ పూట గడవడం కోసం తెలివైన పని చేశానని.. తన లగేజ్ అంతా ఒక ఫ్రెండు గదిలో పెట్టి, తాను వేరే గదిలో ఉండేవాణ్నని.. లగేజే కదా పెట్టింది దానికి రెంటేంటి అని ఒకరితో, నా లగేజ్ ఏమీ లేకుండా ఒకణ్నే ఉంటున్నా కదా దానికి రెంట్ కట్టాలా అని ఇంకొకరితో చెప్పి రెండు చోట్లా అద్దె కట్టకుండా తప్పించుకునేవాడినని అతను తెలిపాడు.

ఇక తాను సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో శ్రీకాంత్ అనే స్నేహితుడు ఎంతగానో సాయం చేశాడని, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అతడికి ఉద్యోగం రాగానే తాను కుదురుకునే వరకు ప్రతి నెలా డబ్బులు ఇచ్చాడని.. అతడి మీద అభిమానంతోనే ‘జాతిరత్నాలు’లో హీరోకు శ్రీకాంత్ అనే పేరు పెట్టినట్లు అనుదీప్ వెల్లడించాడు. ఎన్ని కష్టాలున్నా తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడనని.. అందుకే చిన్నతనంలో తన తల్లి ఎక్కడైనా చావులకు వెళ్లినపుడు తానెక్కడ నవ్వేస్తానేమో అని తోడుగా తీసుకెళ్లేది కాదని అనుదీప్ చెప్పడం విశేషం.