అభిమానుల అతి తగ్గాలి బాస్


తమ ఆరాధ్య కథానాయకుల్ని కలవాలని అభిమానులకు కోరిక ఉండటం సహజం. కానీ సినిమా వేడుకలకు హాజరయ్యే వేలాది మంది అభిమానులను నియంత్రించకుండా వదిలేస్తే చాలా అనర్థాలు జరిగిపోతాయి. అందుకే ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ఏ సినిమా వేడుకలు గమనిస్తే.. అభిమానులు ఒక పరిధి దాటి ముందుకు వెళ్లడానికి అవకాశం ఉండేది కాదు. వాళ్లకు కొన్ని హద్దులు ఏర్పాటు చేసేవాళ్లు. కానీ సినిమా వేడుకల్లో ఈ మధ్య అభిమానులను నియంత్రించడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలం అవుతున్నారు. ఫ్యాన్స్ ఎలా పడితే అలా ముందుకు వచ్చేయడం.. తమ అభిమాన కథానాయకులు వచ్చినపుడు మీద పడిపోవడం.. నేరుగా స్టేజ్‌లు ఎక్కేసి నానా హంగామా చేయడం సాధారణం అయిపోతున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.

ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘బాద్‌షా’ ఆడియో వేడుక సందర్భంగా ఆడిటోరియం బయట ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం తెలిసిన సంగతే. ఐతే బయట జరిగిందానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకోవచ్చు. కానీ ఈ మధ్య ఆడిటోరియం లోపల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. తాజాగా ‘తెల్లవారితే గురువారం’ ఈవెంట్లో అభిమానులు ఎన్టీఆర్‌తో ప్రవర్తించిన తీరు అతిగానే అనిపించింది. అతణ్ని కింద పడేసేలా కనిపించారు. వారి నుంచి తప్పించుకోవడం ఎన్టీఆర్‌కు చాలా కష్టమైంది. ఇంతకుముందు ఒక పరిధి దాటి ముందుకు రాని అభిమానులు.. ఇప్పుడిలా హీరోల మీద పడిపోయే పరిస్థితి ఎందుకొస్తోందన్నది ప్రశ్నార్థకం.

తమకు విపరీతమైన క్రేజ్ ఉందని చాటుకునేందుకు.. కొందరు హీరోలే ఇలా అభిమానులు స్టేజ్‌ల మీదికొచ్చి హంగామా చేసేలా తమ పీఆర్ టీంలతో ప్లాన్ చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. ఈ మధ్య స్టార్ హీరోల వేడుకల్లో ఇదొక ట్రెండ్‌గా మారడం గమనించవచ్చు. హీరోలకు తెలియకుండా కూడా పీఆర్వోలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల నిర్వాహకులు ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారనే వాదనా ఉంది. ఏదేమైనాప్పటికి చూడ్డానికి చాలా చిరాగ్గా అనిపిస్తుండటమే కాక, ప్రమాదకరం కూడా అయిన ఇలాంటి ఉదంతాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.