వైసీపీలో ఆ న‌లుగురికి ప‌ద‌వులు ఫిక్స్ చేసిన జ‌గ‌న్ ?

ఏపీలో సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌కు ఏ మాత్రం ఎదురు లేకుండా పోతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల ప్ర‌జ‌లు నూటికి నూరు శాతం సంతృప్తిగా ఉన్నార‌న్న‌ది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలే ఫ్రూవ్ చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే మండ‌ల పరిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక త‌ర్వాత జ‌గ‌న్ కొద్ది నెల‌ల టైం తీసుకుని త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. జ‌గ‌న్ కేబినెట్లో 90 శాతం మంది మంత్రుల‌ను రీ ప్లేస్ చేస్తాన‌ని ముందే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే మ‌రో నాలుగైదు నెల‌ల్లో కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉండ‌డంతో ఎవ‌రు కేబినెట్లో ఉంటారు ? ఎవ‌రు కొత్తగా వ‌స్తారు ? ఎవ‌రు అవుట్ అవుతారు అన్న దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

మంత్రి ప‌ద‌వి ఆశించే వారి లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంది. వీరంద‌రిని మంత్రి ప‌ద‌వుల‌తో సంతృప్తి ప‌ర‌చ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కూడా కాదు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌ను ఇత‌ర ప‌ద‌వుల‌తో సంతృప్తి ప‌ర‌చాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జ‌గ‌న్ సీఎం అయిన తొలి నాళ్ల‌లోనే వీటిని ఏర్పాటు చేయాల‌ని అనుకున్నా సాధ్యం కాలేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్రాంతీయాభివృద్ధి మండ‌ళ్ల ఏర్పాటు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తోంది. ఉత్తరాంధ్రలో విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల‌తో ఉత్త‌రాంధ్ర ప్రాంతీయాభివృద్ధి మండ‌లి ఏర్పాటు కానుంది.

ఇక గోదావ‌రి ప్రాంతీయాభివృద్ధి మండ‌లిలో కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉంటాయి. ఇక రాజ‌ధాని జిల్లా టూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు అమ‌రావ‌తి ప్రాంతీయాభివృద్ధి మండ‌లిలో ఉంటాయి. ఇక కడప కేంద్రంగా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో సీమ ప్రాంతీయాభివృద్ధి మండ‌లి ఏర్పాటు కానుంది. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర కార‌ణాల‌తో మంత్రి ప‌ద‌వులు లేని వారిని ప్రాంతీయాభివృద్ధి మండ‌ళ్ల‌కు చైర్మ‌న్లుగా చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. వైఎస్ సీఎం అయిన‌ప్పుడు కూడా గ‌తంలో ఇలాగే చేసి కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

ఇక ఈ ప్రాంతీయాభివృద్ధి మండ‌ళ్ల‌కు ఒక చైర్మ‌న్‌తో పాటు కొంద‌రు స‌భ్యులు ఉంటారు. ఉత్త‌రాంధ్ర‌కు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, గోదావ‌రికి పెన‌మ‌లూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, అమ‌రావ‌తికి లేళ్ల అప్పిరెడ్డి, సీమ మండ‌లికి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిల‌ను చైర్మ‌న్లుగా చేయాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. అమ‌రావ‌తి మండ‌లికి మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు కూడా విన‌ప‌డుతోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రి మండ‌లి మార్చిన త‌ర్వాత వీరికి ఈ ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తార‌ని అంటున్నారు.