విశాఖ టీడీపీను ఖాళీ చేసిన వైసీపీ

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్దితి తలెత్తింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఇంకా పదిరోజులు కూడా కాలేదు. అప్పుడు టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లలో ఏడుగురు వైసీపీ ఎంఎల్ఏతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భేటి విషయం బయటపడగానే పార్టీ ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో టీడీపీ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే జీవిఎంసి పరిధిలోని గాజువాక నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో ఎనిమిది చోట్ల టీడీపీ గెలిచింది. మరి ఏమయ్యిందో ఏమో ఎనిమిది మందిలో ఏడుగురు గాజువాక వైసీపీ ఎంఎల్ఏ తిప్పలనాగిరెడ్డితో భేటి అయ్యారు. భేటి సందర్భంగా ఎంఎల్ఏకి పూలబొకే ఇచ్చి మేయర్ స్ధానాన్ని పార్టీ గెలుచుకోవటం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేశారు.

ఎంఎల్ఏతో భేటిఅయిన కార్పొరేటర్లలో పల్లా శ్రీనివాస్, పులి లక్ష్మీబాయి, గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, లేళ్ళ కోటేశ్వరరావు, బొండా జగన్నాధం, మొల్లి ముత్యాలనాయుడున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లు అధికారపార్టీ ఎంఎల్ఏతో భేటిఅయిన విషయం తెలియగానే పార్టీలో సంచలనంగా మారింది. అధికారపార్టీ ఎంఎల్ఏని ఎందుకు కలవాల్సొచ్చింది ? ఇందుకు పార్టీ అధ్యక్షుని అనుమతుందా అనే విషయాలు తెలుసుకునేందుకు వీళ్ళు ఏడుగురికి షోకాజ్ నోటీసిచ్చారు.

రెండు రోజుల్లో షోకాజ్ నోటీసుకు బదులివ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా అందులో హెచ్చరించారు. దాంతో విషయం ముదిరి పాకానపడుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత ధైర్యం పార్టీ నాయకత్వం చేస్తుందా అనేది సందేహమే. ఒకవేళ వీళ్ళంతా టీడీపీలో నుండి వైసీపీలోకి ఫిరాయిస్తే చేయగలిగేది కూడా ఏమీలేదు. ఫలితాలు వచ్చిన వారంలోపే వీళ్ళంతా అధికారపార్టీ ఎంఎల్ఏని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తానికి జీవిఎంసి టీడీపీలో ముసలం మొదలయ్యేట్లే ఉంది.