ఒక్క రోజు.. ఒక్క రాష్ట్రం.. 25వేలకు పైగా కేసులు

పోయింది.. వెళ్లిపోయిందనుకున్న కరోనా తిరిగి వచ్చేసింది. వెళ్లేటప్పుడు ఎంత బలహీనంగా వెళ్లిందో.. తిరిగి వచ్చేటప్పుడు మరింత బలంగా విరుచుకుపడుతోంది. ఇటీవల కాలంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే కావటం గమానార్హం. ఒకరోజులో ఇంత భారీగా కేసులు విరుచుకుపడుతున్న వైనం చూస్తే.. ఇతర రాష్ట్రాల వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి.

ఈ ఏడాది ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదైన పరిస్థితి లేదు. ఇదే తొలిసారి కావటం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క నాగపూర్ జిల్లాలోనే 3796 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సెప్టెంబరులో కరోనా కేసుల ఈస్థాయిలో నమోదు కాగా.. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది.

ఇదంతా చూస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ఇలాంటి ఇబ్బందులు తప్పవన్న హెచ్చరిక పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జిల్లాలతో పోలిస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కేసులు నమోదు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. నాగపూర్ తర్వాత అత్యధిక కేసులు ముంబయిలోనే నమోదయ్యాయి. ఒక్కరోజులో 2877కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో ఫూణె నిలిచింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో సంతోషించే అంశం ఏమైనా ఉందంటే రికవరీ రేటుగా చెబుతున్నారు. కేసుల నమోదు కంటే కూడా రికవరీ రేటు ఎక్కువగా ఉండటం మహారాష్ట్ర సర్కారుకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఇంతలా కేసులు నమోదవుతున్నా.. పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదన్న మాట రాష్ట్ర మంత్రుల నోట వినిపిస్తోంది. కాకుంటే.. కొన్నిచోట్ల మాత్రం రాత్రి వేళలో కర్ఫ్యూను విధించారు.