ప‌వ‌న్ ఈవెంట్.. బ్లాక్‌బ‌స్ట‌ర్ రేంజిలో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ థియేటర్లలోకి దిగడానికి ఇంకెంతో సమయం లేదు. ఇంకో మూడు వారాల్లోనే ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ కావడంతో మొదట్లో పవన్ అభిమానుల్లో కానీ.. సామాన్య ప్రేక్షకుల్లో కానీ పెద్దగా ఆసక్తి కనిపించలేదు కానీ.. రిలీజ్ దగ్గర పడేసరికి అంతా మారిపోయింది. ‘పింక్’ను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు చాలా మార్చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్.. పవర్ స్టార్ అభిమానులను ఆకర్షించే అంశాలు ఇందులో చాలా ఉన్నాయని సంకేతాలు ఇచ్చాడు.

‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్, టీజర్, పాటలు.. అన్నీ కూడా పవన్ అభిమానులకు ట్రీట్ లాగే కనిపించాయి. తాజాగా రిలీజ్ చేసిన ‘కంటి పాప’ పాట సైతం అందరినీ ఆకట్టుకుంది. రిలీజ్ ముంగిట ప్రమోషన్ల జోరు ఇంకా పెంచాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు. పవన్‌తో సినిమా చేయాలన్నది ఆయన కల. ఆ కల నెరవేర్చుకున్న ఆయన.. సినిమాను తన కెరీర్లో ఒక మైలురాయిలా మార్చుకోవాలనుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం రాజు భారీ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం ముఖ్య అతిథులుగా రానున్నారట.

పవన్ మామూలుగా తన సినిమా వేడుకల్లో హడావుడిని ఇష్టపడడు కానీ.. రాజు మాత్రం ‘వకీల్ సాబ్’ వేడుకను కనీ వినీ ఎరుగని రీతిలో చేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చిరుతో పాటు చరణ్‌ను కూడా ఈ వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం. పవన్ కోసం వాళ్లిద్దరూ ఎంతో ఆనందంగా విచ్చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కెరీర్లో మూడేళ్లకు పైగా విరామం తర్వాత జరుగుతున్న సినీ వేడుక కావడంతో పవన్ ఏం మాట్లాడతాడు.. సినిమా గురించి, అన్నయ్య గురించి ఏం చెబుతాడు అన్నది ఆసక్తికరం. తమ్ముడి గురించి చిరు.. తండ్రి, బాబాయిల గురించి చరణ్ ఏం మాట్లాడతారన్నదీ ఆసక్తికరమే. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుండగా.. 3న ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం.