విశాఖ గెలుపు.. ఆ మంత్రికి చేటు తెచ్చిందా?

అధికార పార్టీ వైసీపీ.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యం అయితే.. సాధించింది. కానీ.. ఆశించిన విధంగా మాత్రం డివిజ‌న్ల‌ను ఏక‌ప‌క్షం చేసుకోలేక పోయింది. నిజానికి వైసీపీ కీల‌క నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆది నుంచి ఇక్క‌డ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ప్ర‌తి డివిజ‌న్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అభ్య‌ర్థుల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ ఎంపిక చేసుకు న్నారు. ఈ క్ర‌మంలో ఆంధ్రా యూనివ‌ర్సిటీకి చెందిన వీసీని కూడా రాజ‌కీయంగా వాడుకున్నార‌నే వాద‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ.. 98 డివిజ‌న్ల‌ల‌లో వైసీపీ కేవ‌లం 58 డివిజ‌న్లు మాత్ర‌మే సొంతం చేసుకుంది. ఇది వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఆది నుంచి మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామ‌ని భావించిన పార్టీ నాయ‌క‌త్వానికి ఇలా బొటా బొటీ ఫ‌లితం.. జీర్ణించుకునే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలోనే కార‌ణాలు వెత‌కడం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో సాయిరెడ్డి సేఫ్ అయిపోగా.. జిల్లాలో ఒకే ఒక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ చుట్టూ.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఆయ‌న క్యాంపు కార్యాల‌యం ఉన్నడివిజ‌న్‌లో టీడీపీ విజ‌యం సాధించడం.. త‌న సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న చోట్ల వైసీపీ త‌క్కువ ఓట్లు ప‌డ‌డం.. వంటివి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఇక్క‌డ ఆది నుంచి అవంతి వ‌ర్సెస్ సాయిరెడ్డి మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతోంది. తాను మంత్రిని అయినా.. ప‌ట్టించుకోవడం లేద‌ని.. క‌నీసం ప్రొటోకాల్ కూడా పాటించ‌డం లేద‌ని.. అవంతి ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విజ‌యం సాధించి.. త‌న స‌త్తా నిరూపించుకోవాల‌ని అనుకున్నారు. కానీ.. అది సాధ్యం కాలేదు. ఒక‌వైపు భీమిలి మునిసిపాలిటీ, మ‌రోవైపు విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ఆయ‌న మేనేజ్ చేయ‌లేక పోయార‌నే వాద‌న ఉంది. భీమిలి మునిసిపాలిటీలో టీడీపీ పుంజుకుంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఓడిపోయిన పార్టీ.. ఇప్పుడు ఏడుకు పైగా డివిజ‌న్ల‌లో విజ‌యం సాధించింది. దీంతో అవంతి వ్యూహాత్మ‌కంగా విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న సాయిరెడ్డి వ‌ర్గంలో వినిపిస్తోంది.

విశాఖ గెలిచామంటే.. మా సాయిరెడ్డి గారి వ‌ల్లే అంటూ.. కొంద‌రు అప్పుడే భ‌జ‌న ప్రారంభించారు. అయితే.. అవంతి విష‌యంపై మాత్రం అంద‌రూ మౌనంగా ఉన్నారు. ఇక‌, అవంతి కూడా పెద్ద‌గా దీనిపై రియాక్ట్ కావ‌డం లేదు. కానీ.. లోలోన మాత్రం మ‌ధ‌న ప‌డుతున్నార‌నేది వాస్త‌వం. రేపు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న స‌మ‌యంలో ఆయ‌న‌పై వేటు ప‌డుతుంద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.