అఖిల్ 5.. తగ్గేదే లేదు

అక్కినేని అఖిల్‌ తెరంగేట్రానికి ముందు ఎంత హడావుడి నడిచిందో తెలిసిందే. తెలుగులో ఒక సూపర్ స్టార్ అవతరించబోతున్నాడన్న ఫీలింగ్ కలిగింది అందరికీ. ఒక కొత్త హీరో సినిమాకు రూ.30 కోట్లకు పైగా బడ్జెట్, రూ.40 కోట్ల మేర బిజినెస్ అంటే మాటలు కాదు. ‘అఖిల్’ సినిమా అంచనాలను అందుకుని ఉంటే ఇప్పుడు అఖిల్ రేంజి వేరుగా ఉండేదేమో. ఆ సినిమా తుస్సుమనిపించగా.. ఆ తర్వాత అఖిల్ చేసిన రెండు సినిమాలు కూడా తీవ్ర నిరాశకే గుర్తు చేశాయి.

ఇప్పుడు అఖిల్ కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద అల్లు అరవింద్ పది కోట్లకు మించి పెట్టలేదని అంటున్నారు. ఇదీ ప్రస్తుతం అఖిల్ స్థాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ బాగా ఆడితే అఖిల్ మార్కెట్ పెరుగుతుందేమో చూడాలి. ఐతే అఖిల్ తర్వాతి సినిమా గురించి వినిపిస్తున్న ముచ్చట్లు మాత్రం గుండెలదిరిపోయేలా చేస్తున్నాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఐదో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది భారీ బడ్జెట్ మూవీ అని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి. కానీ బడ్జెట్ మరీ రూ.50 కోట్లు అంటూ మొదట్లో వచ్చిన వార్తలు రూమర్లనే అనుకున్నారంతా. కానీ నిజంగానే ఈ సినిమా మీద రూ.50 కోట్లు పెట్టేయబోతున్నారట. సురేందర్ రెడ్డి మీద భరోసాతో నిర్మాత అనిల్ సుంకర ఆ మేర ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా స్కేల్ ప్రకారం చూస్తే ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుందని.. అఖిల్ గత సినిమాల ప్రభావం దీనిపై ఏమీ ఉండదని, కచ్చితంగా ట్రేడ్‌ను ఈ సినిమా ఆకర్షిస్తుందని, అందుకే అనిల్ రూ.50 కోట్లు పెట్టేయడానికి వెనుకాడట్లేదని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ భారీగా ఉండేలా చూస్తున్నారట. రష్మిక మందన్నాను కథానాయిక పాత్ర కోసం, మోహన్ లాల్‌ను గెస్ట్ రోల్ కోసం అడుగుతున్నట్లు సమాచారం. టెక్నీషియన్లను కూడా పెద్ద పెద్ద వాళ్లనే తీసుకోబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.