మోహ‌న్ బాబుతో రానా సినిమా

టాలీవుడ్ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఐతే రెండు మూడు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన ఆయన గత పది పదిహేనేళ్లలో మాత్రం బాగా జోరు తగ్గించేశారు. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అది కూడా సొంత బేనర్లో చేస్తున్నదే. ఆయన ప్రతిభను బయటి నిర్మాతలు ఉపయోగించుకోకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు.

ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత మోహన్ బాబు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. సొంత బేనర్లో ‘సన్ ఆఫ్ ఇండియా’ చేస్తూనే.. సూర్యతో కలిసి ‘ఆకాశం నీ హద్దురా’లో నటించారు. తమిళంలో ‘పొన్నియన్ సెల్వన్’ కూడా చేస్తున్నారు. తెలుగులోనూ ఆయన బయటి బేనర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది.

తన కొడుకు మంచు విష్ణు హీరోగా నటించిన ‘మోసగాళ్ళు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా తాను సురేష్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా నిర్మించనున్నాడట. సినిమా పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ.. రానా ప్రస్తావన వచ్చినపుడు మోహన్ బాబు ఈ విషయం బయటపెట్టారు.

మోహన్ బాబు మాట్లాడుతున్నపుడే రానా సభా ప్రాంగణంలోకి రాగా, అతణ్ని వేదిక మీదికి పిలిచిన మోహన్ బాబు.. ‘‘ఏడు గంటలకు వస్తానని పది గంటలకు వచ్చావు. రేప్పొద్దున నువ్వు ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకు నేను ఇలాగే ఆలస్యంగా వస్తే ఒప్పుకుంటావా’’ అని అడిగారు. దానికి రానా బదులిస్తూ.. ‘‘నేను తీయబోయే సినిమా మీ ఇంట్లోనే షూట్ చేస్తాం. మీరు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడొచ్చి మీ ముందు కెమెరా పెడతాం కాబట్టి ఇబ్బంది లేదు’’ అన్నాడు. ఇది సరదా సంభాషణలాగా కనిపించినా.. తర్వాత మోహన్ బాబు సీరియస్‌గానే అసలు విషయం చెప్పారు. ఒకప్పుడు రామానాయుడి నిర్మాణంలో సినిమా చేసిన తాను.. త్వరలో రానా ప్రొడక్షన్లో నటించబోతున్నట్లు తెలిపారు.