చిరంజీవికి తప్ప ఇతర సెలబ్రిటీలకు ఆందోళన పట్టదా ?

తెలుగు సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పెద్దగా పట్టించుకోరు. సమస్యల పట్ల, పరిష్కారం విషయంలో కూడా ఇతర భాషల్లో సెలబ్రిటీలు స్పందించినట్లుగా మన సెలబ్రిటీలు పట్టించుకోరు. ఈ విషయంలో మామూలు జనాలకు చాలా మంటగా ఉన్నా చేయగలిగేదేమీలేదు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్నే తీసుకున్నా ఆ విషయం స్పష్టమైపోతుంది.

ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం చాలా సింపుల్ గా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తు వైజాగ్ జనాలు దాదాపు నెలన్నర రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇన్ని రోజులకు మెగాస్టార్ చిరంజీవి తప్ప మరో సెలబ్రిటి కనీసం పట్టించుకోలేదు. స్పందించటానికి చిరంజీవికి కూడా ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో అర్ధం కావటంలేదు.

విశాఖ ఉక్కు సాధించుకోవటంలో అప్పట్లో జరిగిన ఆందోళనల నినాదాలు ఇప్పటికీ తన చెవుల్లో మారు మోగుతున్నట్లు చెప్పారు. మరి అదేనిజమైతే కేంద్ర నిర్ణయం వెలుగుచూడగానే ఎందుకని ఆందోళనలకు మద్దతు తెలపలేదు ? ఏదో మొక్కుబడిగా ఒక ట్వీట్ చేసి ఊరుకోవటం కాకుండా నేరుగా వైజాగ్ వెళ్ళి చిరంజీవి ఆందోళనల్లో పాల్గొంటే ఆ ఇంపాక్టే వేరుగా ఉంటుంది. సరే చిరంజీవి ఇన్ని రోజులకు కనీసం ఓ ట్వీట్ అన్నా పెట్టారు. మరి ఇతర సెలబ్రిటీలు అదికూడా చేయలేదు.

ఇక్కడే సెలబ్రిటీల మనస్తత్వం చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్నటి కరోనా విషయంలో కూడా మనవాళ్ళు బహిరంగంగా స్పందించిన దాఖలాలు చాలా చాలా తక్కువే. తమిళనాడు, కర్నాటక, ముంబాయ్ లో సెలబ్రిటీలు జనాలకు ఎంత సర్వీసు చేశారో చూసిన తర్వాత కూడా మనవాళ్ళు వాళ్ళ అంతఃపురాల్లో నుండి బయటకు రాలేదు. ఇక్కడే తమిళనాడును స్పూర్తిగా తీసుకోవాలని అందరు అనుకునేది.

జల్లికట్టు విషయంలో కేంద్రం జోక్యాన్ని తమిళనాడులోని రాజకీయపార్టీలు, సెలబ్రిటీలు, మామూలు జనాలు వ్యతిరేకించిన తీరు మనలో కనబడలేదు. విచిత్రమేమిటంటే జల్లికట్టు ఉద్యమానికి పోటీలు పడి మరీ మన సెలబ్రిటీలు మద్దతు తెలపారు. వంతుల వారీగా మన సెలబ్రిటీలు వైజాగ్ వెళ్ళి ఆందోళనకు మద్దతుగా నిలబడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ పద్దతిని మనం ఆశించవచ్చా ?