శర్వానంద్‌కు సినిమా అవకాశాలు ఆగిపోతే..

సినీ రంగంలో హీరోలకు మించిన సెక్యూరిటీ ఇంకెవరికీ ఉండదు. ఒకసారి స్టార్ ఇమేజ్ సంపాదిస్తే దశాబ్దాలు దశాబ్దాలు ఇండస్ట్రీలో కొనసాగొచ్చు. స్టార్ హీరోలకు సినిమాలు కాకుండా పెద్దగా ప్రత్యామ్నాయ ఆలోచనలు ఉండవు. ఐతే శర్వానంద్ మాత్రం సినిమాలు ఆపేస్తే ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అతను వ్యవసాయం వైపు వెళ్లబోతున్నాడట.

శర్వా కొత్త సినిమా ‘శ్రీకారం’ వ్యవసాయం చుట్టూ తిరిగే కథే అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రైతుల గురించి, వ్యవసాయం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని.. తాను భవిష్యత్తులో వ్యవసాయం చేస్తానని శర్వా స్పష్టం చేశాడు. ఇదేదో సినిమా ప్రమోషన్ కోసం చెబుతున్న మాట కాదని.. నిజంగానే అటు వైపు వెళ్తానని శర్వా చెప్పాడు.

‘‘భవిష్యత్తులో సినిమా అవకాశాలు తగ్గిపోతే.. నాకిక్కడ కెరీర్ లేదనిపిస్తే.. నేను వ్యవసాయమే చేస్తాను. కరోనా వల్ల దొరికిన విరామంలో నాకు వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది. మూడు నెలల పాటు ఫాం హౌస్‌లోనే గడిపా. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నా. ఆర్గానిక్ ఫార్మింగ్, టెర్రస్ ఫార్మింగ్ లాంటివి బాగా పాపులర్ అవుతున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే వ్యవసాయంలో మంచి ఫలితాలే ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో నేను వ్యవసాయం చేసే అవకాశాలున్నాయి’’ అని శర్వా తెలిపాడు.

ఇక ‘శ్రీకారం’ గురించి మాట్లాడుతూ.. సినిమాలో ఊరికే వ్యవసాయం ఊరికే ఉపన్యాసాలు దంచేస్తే జనాలకు బోర్ కొడుతుందని, అందుకే ఈ కథను సందేశాత్మకంగా కాకుండా.. కమర్షియల్‌గానే చెప్పే ప్రయత్నం చేసినట్లు శర్వా వివరించాడు. ‘శ్రీకారం’ కోసం తమ నిర్మాతలు నిజంగానే పొలంలో పంట పండించినట్లు అతను వెల్లడించాడు. కరోనా వల్ల బ్రేక్ రావడంతో ఆ పంట మధ్య షూటింగ్ చేయలేని పరిస్థితి వచ్చిందని.. దీంతో మళ్లీ ఇంకో పంట వేయించి చిత్రీకరణ జరిపినట్లు శర్వా చెప్పాడు. ఈ సినిమా కోసం తమ టీం ఇంత సిన్సియర్‌గా పని చేసిందని, తమ ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి కచ్చితంగా మంచి స్పందన వస్తుందని శర్వా ధీమా వ్యక్తం చేశాడు.