ఉన్నతాధికారులే మోసం చేశారా ?

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలోని ఉన్నతాధికారులే మోసం చేశారా ? అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి అవుననే అనిపిస్తోంది. ఉక్కును ప్రైవేటీకరించాలనే ఒప్పందం 2019లోనే జరిగింది. కేంద్రానికి, దక్షిణికొరియా సంస్ధ పోస్కో మధ్య జరిగిన ఒప్పందంలో విశాఖ ఉక్కు ఉన్నతాధికారి ఒకరు సంతకం చేశారట. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్ని పార్లమెంటులో ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన తర్వాత కానీ విషయం వెలుగుచూడలేదు.

అయితే కేంద్రమంత్రి ప్రకటనకు కొద్దిరోజుల ముందు మాత్రమే పోస్కో కంపెనీతో కేంద్రం ఒప్పందం చేసుకున్నారని అందరు అనుకున్నారు. అయితే అదంతా తప్పని 2019లోనే ఉక్కు ఫ్యాక్టరీలోని ఓ ఉన్నతాధికారి సంతకంతో ఒప్పందం పూర్తయినట్లు ఇపుడు బయటపడింది. అలాగే అప్పట్లోనే కొందరు కార్మిక నేతలకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసట. స్వయంగా ధర్మేంద్ర ప్రధాన ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చినపుడు కొందరు కార్మికనేతలతో జరిగిన చర్చల్లో ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారట.

అయితే కేంద్రమంత్రితో చర్చలు జరిపిన సదరు కార్మిక నేతలు కూడా ఈ విషయం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తలు పడ్డారట. మరి ఇదే నిజమైతే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఇపుడు జరుగుతున్న ఆందోళనలకు అర్ధమేలేదు. ఎందుకంటే పోస్కో కంపెనీకి విశాఖ ఉక్కును అప్పగించేస్తున్న విషయం ఫ్యాక్టరీలోని ఉన్నతాధికారితో పాటు కొందరు కార్మికనేతలకు కూడా తెలుసంటున్నారు. కాబట్టి ఇందులో కేంద్రం పాటించిన గోపత్యా లేదు, చేసిన మోసమూ లేదు.

మరి అన్నీ విషయాలు రెండు సంవత్సరాలకు ముందే తెలిసినపుడు ఇంతకాలం కేంద్ర నిర్ణయంపై అందరు ఎందుకు మౌనం పాటించారు ? అన్నదే అసలైన ప్రశ్న. దాదాపు రెండేళ్ళ క్రితమే తమకు తెలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిన వాళ్ళదే అసలైన తప్పని అర్ధమవుతోంది. మరి తప్పులన్నీ విశాఖ ఫ్యాక్టరీలోనే పెట్టుకుని ఇపుడు కేంద్రంపై మండిపడితే ఉపయోగం ఏముంటుంది ? విశాఖలో జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే సమైక్య రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలే గుర్తుకొస్తున్నాయి.