తమిళనాట ఆ కూటమికి బంపర్ మెజారిటీ?

దేశంలో త్వరలోనే నాలుగు రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న వాటిలో తమిళనాడు ఒకటి. సంప్రదాయానికి మారుస్తూ వరుసగా రెండోసారి ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఐదేళ్ల కిందట ఆశ్చర్యపరిచారు తమిళనాడు ప్రజలు. జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే పార్టీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. కానీ ఈ విజయాన్ని ఎంతోకాలం జయలలిత ఆస్వాదించలేకపోయారు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పట్నుంచి ఒడుదొడుకుల మధ్య నడుస్తోంది సర్కారు.

పళనిస్వామి చివరి రెండేళ్లలో కాస్త కుదురుకున్నట్లే కనిపించారు కానీ.. అదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే పార్టీ బలంగా పుంజుకుంది. కొత్తగా రంగంలోకి దిగిన కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీదిమయం అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయింది. రజినీకాంత్ అసలు పార్టీనే పెట్టలేకపోయారు. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు అనుకున్నంత రసవత్తరంగా మారలేకపోయింది.

ఎన్నికలకు నెల రోజుల ముందే తమిళనాడు ఫలితాలపై స్పష్టమైన అంచనా వచ్చేసినట్లే ఉంది. ఇప్పటికే ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో డీఎంకే కూటమికి స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సహా కొన్ని మిత్ర పక్షాలతో కలిసి పోటీ చేస్తున్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రాబోయే ఎన్నికల్లో 168 స్థానాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోబోతోందని.. టైమ్స్ నౌ తాజా సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ కూటమికి 60 స్థానాలు అధికంగా వస్తాయిన ఈ సర్వే తేల్చింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గత ఎన్నికలతో పోలిస్తే 71 స్థానాలు కోల్పోయి 65 స్థానాలకు పరిమితం కానుందట.

ఇక కేరళ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న యూడీఎఫ్ కూటమి గత ఎన్నికలతో పోలిస్తే 8 స్థానాలు మెరుగయ్యే అవకాశమున్నప్పటికీ.. అధికారం మాత్రం చేపట్టలేదని సర్వేలో తేలింది. ఆ కూటమి 56 స్థానాలకు పరిమితం కానుందట. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమికి 8 స్థానాలు తగ్గనున్నప్పటికీ.. 82 సీట్లతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు టైమ్స్ నౌ సర్వేలో తేలింది.