గెలిచే ఛాన్స్ టీడీపీదే.. కానీ.. ఓట‌మి దిశ‌గా.. ఎందుకిలా?

రాష్ట్రంలో జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించాల‌ని.. పార్టీని పుంజుకునేలా చేయాల‌ని… చంద్ర‌బాబు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ప్ర‌యాస ప‌డుతున్నారు. రోడ్ షోలు నిర్వ ‌హిస్తున్నారు. గెలిచి తీరాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఇత‌ర ప్రాంతాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నప్ప‌టికీ.. గెలిచే అవ‌కాశం ఉన్న న‌గ‌ర మునిసిపాలిటీల్లో ఇప్పుడు త‌ప్ప‌ట‌డుగులు ప‌డు తున్నాయి. ఇలాంటి చాలానే ఉన్నాయ‌ని.. అంచ‌నాలు వ‌స్తున్నా… ఇటు చంద్ర‌బాబు కానీ.. అటు లోకేష్ కానీ… ఇలాంటి వాటిపై దృష్టి పెట్ట‌డం లేదు. మ‌రి రీజ‌నేంటి? ఎందుకు ఇలా జ‌రుగుతోంది.

ఉదాహ‌ర‌ణ‌కు.. నెల్లూరు జిల్లాలోని వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం, అనంత‌పురం జిల్లాలోని క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం లోని మునిసిపాలిటీల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి చాలా ఎడ్జ్ ఉంది. ఇక్క‌డ వైసీపీ నేత‌లుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు.. పెద్ద‌గా ప్ర‌జాద‌ర‌ణ‌ను పొంద‌లేక పోతున్నార‌నేది వాస్త‌వం. అదేస‌మ‌యంలో ఇక్క‌డ అభివృద్ధి కూడా గ‌డిచిన రెండేళ్ల‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి కూడా పెద్ద‌గా లేదు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు పుంజుకునే అవ‌కాశం మెండుగా ఉంది. అయితే.. ఇక్క‌డి టీడీపీ కీల‌క నేత‌ల‌కు నైతికంగా మ‌ద్ద‌తు ఇచ్చే వారు క‌నిపించ‌డం లేదు. వెంక‌ట‌గిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ‌.. దూకుడు బాగానే ఉన్నా… క‌లిసి వ‌చ్చే నాయ‌కులు క‌నిపించ‌డం లేక‌… ఒంట‌రిగానే ప్ర‌చారం చేస్తున్నారు..

ఇక‌, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు కందికుంట వెంక‌ట ప్ర‌సాద్ కూడా ఎదురీత ధోర‌ణిలోనే ముందుకు సాగుతున్నారు. క‌లిసి వ‌చ్చే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన చాంద్ బాషా.. వైసీపీని కాద‌ని.. టీడీపీలోకి వ‌చ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారు. పేరుకు మాత్రం టీడీపీలో ఉన్నారు. మిగిలిన నేత‌లు కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని.. అధికార పార్టీతో కుమ్మ‌క్క‌య్యార‌నే వాద‌న వినిపిస్తోంది.

అలా కాకుండా కొంచెం క‌ష్ట‌ప‌డితే… ఈ రెండు మునిసిపాలిటీలు టీడీపీ ఖాతాలో ప‌డే అవ‌కాశం మెండుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ అదినేత చంద్ర‌బాబు , మాజీ మంత్రి లోకేష్‌లు ఇలాంటి గెలుపు అవ‌కాశం ఉన్న మునిసిపాలిటీల‌పై దృష్టి పెడితే.. సునాయాశంగా విజ‌యం సాధించ‌వ‌చ్చ‌నేది ప‌రిశీల‌కుల భావ‌న‌.