‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నవీన్ చేసుంటే..

నవీన్ పొలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ఒక్కసారిగా మంచి ఫాలోయింగ్ సంపాదించి బిజీ అయిపోయిన నటుడు. నిజానికి ఈ సినిమా చేయడానికి ఏడెనిమిదేళ్ల ముందు నుంచి అతను తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ అతడి ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘1 నేనొక్కడినే’ లాంటి పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ అతడికి పెద్దగా పేరు రాలేదు. ఉత్తరాదిన మాత్రం అతడికి షార్ట్ ఫిలిమ్స్, ‘చిచ్చోరే’ లాంటి సినిమాలతో మంచి పేరే వచ్చింది. తెలుగులో మాత్రం బ్రేక్ రావడానికి చాలా టైం పట్టేసింది.

ఐతే నాగ్ అశ్విన్ ప్రణాళిక వర్కవుట్ అయి ఉంటే నవీన్‌కు చాలా ముందుగానే బ్రేక్ వచ్చేదట. అతను దర్శకుడిగా పరిచయం అయిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకు ముందు హీరోగా అనుకున్నది నవీన్‌నే అట. కానీ కొన్ని కారణాల వల్ల అతడితో ఆ సినిమా చేయలేదని నాగ్ అశ్విన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘నిజానికి నవీన్‌ను నేనే హీరోగా పరిచయం చేయాల్సింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నవీన్, విజయ్ దేవరకొండలతో తక్కువ బడ్జెట్లో చేయడానికి ప్రణాళికలు వేసుకున్నా. అనుకోకుండా మాకు నాని దొరికాడు. దీంతో ఆ సినిమా స్థాయి పెరిగింది. అనుదీప్ ఐదేళ్ల కిందట తీసిన ఒక షార్ట్ ఫిలిం చూసి మంచి కథ ఉంటే చెప్పు చేద్దామని చెబితే.. రెండేళ్ల కిందట ‘జాతిరత్నాలు’ స్టోరీ చెప్పాడు. అప్పుడు ఈ సినిమాకు నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పర్ఫెక్ట్ అనిపించింది. రెండేళ్ల ముందే నవీన్‌కు ఈ కథ చెప్పాం. అతను అప్పటికి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత చేస్తానన్నాడు. మా అదృష్టం కొద్దీ ఆ సినిమా పెద్ద హిట్టయి నవీన్ స్థాయి పెరిగి ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.

ముందు ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’ అనే టైటిల్ అనుకోలేదని.. ఆణిముత్యాలు, సుద్దపూసలు అనే పేర్లు పరిశీలించామని.. చివరికి ‘జాతిరత్నాలు’ అయితే క్యాచీగా ఉంటుందని, జనాల్లోకి సులువుగా వెళ్తుందని ఆ పేరు ఖరారు చేశామని అశ్విన్ వెల్లడించాడు.