జగన్ ఢిల్లీ టూర్ – వైసీపీ వెర్షనేంటి?

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. విశాఖ ఉక్కు విషయంలో జరుగుతున్న ఆందోళనతో పాటు.. ఇటీవలి పరిణామాలపై ప్రధాని మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లాలని అనుకుంటున్నారు. వాస్తవానికి తిరుపతిలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అమిత్ షా వచ్చినప్పుడు.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావాలని భావించారు.

అయితే.. ఆయన పర్యటన రద్దు కావటంతో ఇప్పుడు జగనే ఢిల్లీకి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇదేమీ కాదు.. సీఎం జగన్ ను ఢిల్లీకి రావాలని కేంద్రం నుంచే కబురు వచ్చినట్లు చెబుతున్న వారు లేకపోలేదు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరికినా దొరక్కపోయినా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటం.. కేంద్ర దన్ను అవసరం కావటంతో పాటు.. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికైతే ముందుకు వెళ్లకుండా ఆగాలని కోరనున్నట్లు చెబుతున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక నగరాలైన విశాఖ.. విజయవాడ.. తిరుపతి.. లాంటి వాటిని సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి వాటికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుగా మారింది.

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదం అంతకంతకూ బలోపేతం కావటం.. ప్రజల సెంటిమెంట్లను కేంద్రానికి చెప్పి.. వారి నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సీఎం జగన్ కోరనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. పోలవరం ఎత్తు తగ్గించటం కుదరదన్న విషయాన్ని తేల్చి చెప్పాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకుకేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వాటిని విడుదల చేయాలని కోరనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.