మోడికి స్పీడుకు బ్రేకులు పడటం ఖాయమేనా ?

పశ్చిమబెంగాల్లో ఎన్నికల కుంపట్లు బాగా రగులుకుంటున్నది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీలు ఎన్నికల్లో గెలుపుకోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో రెండు వైపుల అగ్రనేతలు రగిలిపోతున్నారు. ఇందులో బాగంగానే నరేంద్రమోడి తరపున అమిత్ షా+కేంద్రమంత్రులు, పార్టీ నేతలు మమతాబెనర్జీని టార్గెట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఫైర్ బ్రాండ్ గా పేరున్న మమత కూడా అంతే స్ధాయిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు.

వీళ్ళద్దరి రాజకీయ వైరంతో బెంగాల్లో మంటలు మండుతుండగానే ఏబీపీ-సీ వోటర్ సర్వే పేరుతో ఓ ప్రెడిక్షన్ తెరపైకి వచ్చింది. దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో  మమత హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే దేశరాజకీయాలు ఓ మలుపు తిరగటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో బీజేపీకి పట్టేమీ లేదని తెలుసు. కాబట్టి ఓ నాలుగు సీట్లొచ్చినా అదే పదివేలు.

ఇక అస్సాం అన్నది చాలా చిన్న రాష్ట్రం కాబట్టి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. పాండిచ్చేరి రాష్ట్రం విషయంలో కూడా డిటోనే.  అందుకనే అందరి దృష్టి ఇపుడు బెంగాల్ మీదే పడింది. ఇక్కడ గనుక మమత ఓడిపోతే నరేంద్రమోడి రెట్టించిన ఉత్సాహంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. అప్పుడు దేశంలో మోడిని నిలువరించే ప్రత్యర్ధి దాదాపు లేరనే చెప్పాలి. అదే మమతే మళ్ళీ పవర్లోకి వస్తే మాత్రం మోడి స్పీడుకు బ్రేకులు పడతాయనటంలో సందేహం లేదు.

మోడి అంటే మంటగా ఉండే రాజకీయ ప్రత్యర్ధులకు మమత ఓ హీరోలాగ కనబడతారు. ఎందుకంటే ఇపుడు మమత దీదీని గవర్నర్+కేంద్రమంత్రులు అంతగా రాచి రంపాన పెడుతున్నారు. ఇన్నింటినీ తట్టుకుని మమత మళ్ళీ గెలవటమంటే మామూలు విషయం కాదు. అందుకనే జాతీయస్ధాయిలో మమతకు హీరో ఇమేజి వచ్చేస్తుంది. అప్పుడు మోడి వ్యతిరేక పార్టీలన్నీ మమత పంచన చేరటానికి రెడీ అవుతాయి.

కేసీయార్ లాంటి స్ధిరచిత్తం లేని సీఎంలు కూడా మమతకు జై కొట్టినా ఆశ్చర్యంలేదు. ఇన్నింటి నడుమ అప్పుడప్పుడు మోడి ప్రవచిస్తున్న జమిలి ఎన్నికల జపానికి కూడా బ్రేకులు పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే మోడి వైఖరి కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ సమయంలో గనుక జమిలి ఎన్నికలను తీసుకొస్తే అది మోడికి చాలా ఇబ్బందిగా మారే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టే అందరి చూపులు ఇపుడు బెంగాల్ మీద కేంద్రీకృమయ్యుంది.