నితిన్ మళ్లీ ట్రాక్ తప్పాడు


టాలీవుడ్లో కన్సెస్టెన్సీ లేని హీరోల్లో యువ కథానాయకుడు నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభంలో వరుసగా మూడు హిట్లు కొట్టాడు. ఆ తర్వాత దశాబ్దం పైగా సక్సెస్ లేకుండా గడిపాడు. ఆ తర్వాత ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడి వెంటనే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ రూపంలో మరో సూపర్ హిట్ ఇచ్చాడు. కానీ తర్వాత మళ్లీ మామూలే. గత నాలుగైదేళ్లలో చూసుకున్నా.. నితిన్ ఒక హిట్ కొట్టడం.. తర్వాత ట్రాక్ తప్పడం మామూలైపోయింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అఆ’ బ్లాక్‌బస్టర్ అయ్యాక వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చాయి అతణ్నుంచి. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం తీవ్రంగా నిరాశ పరిచాయి. గత ఏడాది ‘భీష్మ’తో మళ్లీ అతను మంచి విజయాన్నందుకున్నాడు. కొత్తగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెట్టడంతో నితిన్ ఈసారైనా నిలకడ చూపిస్తాడని ఆశించారు అభిమానులు. కానీ వారికి మళ్లీ నిరాశ తప్పలేదు.

నితిన్ కొత్త సినిమా ‘చెక్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లే ఉంది. వీకెండ్లోనే ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. తొలి రోజు వరల్డ్ వైడ్ 3.7 కోట్ల షేర్‌తో పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల్లో తేలిపోయింది. ఈ రెండు రోజుల షేర్ రూ.మూడున్నర కోట్లకు అటు ఇటుగా ఉండటం గమనార్హం. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటిదాకా రూ.7.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. నితిన్‌కు మంచి మార్కెట్ ఉన్న నైజాంలో రూ.2.4 కోట్ల షేర్ రాబట్టిన ‘చెక్’ మిగతా ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

‘ఉప్పెన’తో పోటీ, డివైడ్ టాక్ ఈ సినిమాను బాగానే దెబ్బ కొట్టినట్లుంది. ‘చెక్’ థియేట్రికల్ హక్కులు రూ.15.5 కోట్లకు అమ్మడం గమనార్హం. అందులో ఇప్పటిదాకా సగం కూడా వసూలు కాలేదు. వీకెండ్లోనే ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా.. ఇక వీక్ డేస్‌లో నిలబడటం అసాధ్యం. ఇక చెప్పుకోదగ్గ షేర్ రాకపోవచ్చు. ‘చెక్’ డిజాస్టర్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక నితిన్ ఆశలన్నీ ఈ నెలలో వచ్చే ‘రంగ్ దె’ మీద పెట్టుకోవాల్సిందే.